తండ్రిని అప్పు అడిగారా? హరికృష్ణ గురించి ఎవరికీ తెలియని విషయాలు!
నందమూరి హరికృష్ణ మరణం తెలుగు సినిమా పరిశ్రమనే కాదు.. పార్టీలకు అతీతంగా ఆయనతో పరిచయం ఉన్న ప్రతిఒక్కరినీ బాధించింది. హరికృష్ణ వ్యక్తిత్వం విలక్షణమైనది, గొప్పది కాబట్టే ఆయనంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడేవారు. హరి ముక్కుసూటి తనం, గర్వం లేని తనం, ఏ విషయాన్నైనా ధైర్యంగా మాట్లాడే తత్వం, ఇతరులకు ఆయన ఇచ్చే గౌరవం, స్నేహం చేసే విధానం హరికృష్ణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ప్రత్యేక బాధ్యతల అధికారిగా పనిచేసిన గోటేటి రామచంద్రరావు... హరికృష్ణ మరణం అనంతరం ఆయన గురించి గుర్తు చేసుకుంటూ ఓ పత్రికకు వ్యాసం రాశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

చైతన్య రథం
ఎన్టీఆర్ మొదటిసారి ఎన్నికల యాత్రకు బయలుదేరినప్పుడు చైతన్య రథ నడిపింది హరికృష్ణ కాదని, అది పాత వ్యాను కావడంతో తనకు డ్రైవర్గా ఉన్న రెడ్డిని తీసుకెళ్లారు. నాదెండ్ల భాస్కరరావు ఉదంతం తర్వాత చైతన్య రథ సారధిగా హరికృష్ణ బయలుదేరారు. హరికృష్ణ అత్యంత జాగ్రత్తగా, రామారావు గారికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం లేకుండా సమర్థతతో రథాన్ని నడిపేవారని గోటేటి రామచంద్రరావు గుర్తు చేసుకున్నారు.

అలా అనడంతో హరికృష్ణ అసంతృప్తి
చైతన్య రథయాత్ర సమయంలో రెండు చోట్ల అపశ్రుతులు దొర్లాయి. ఏటవాలుగా ఉన్న సిద్ధాంతం వంతెన ఎక్కుతున్నప్పుడు అనుకోకుండా ఇంజనులో తీవ్రమైన పొగలొచ్చాయి. లోయర్ మానేరు డ్యాం ప్రాంతంలో హరికృష్ణ రథం నడిపే సమయంలో ప్రమాదవశాత్తు ఓ సెక్యురిటీ గార్డు కాలికి గాయం ఏర్పడింది. అపుడు హరికి విరామం ఇవ్వాలని, వేరొకరిని పెట్టాలని చెప్పడంతో ‘నాకు డ్రైవింగ్ రాదా అంటూ హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రామారావు హరికృష్ణ మాటను కాదనలేక మళ్లీ ఆయననే రథ సారధిగా కొనసాగించారని... గోటేటి రామచంద్రరావు తన వ్యాసంలో గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్-అక్కినేని మధ్య విభేదాలుంటే నాకేంటి అంటూ...
ఓసారి శివాజీ గణేశన్ కుమారుని వివాహ శుభలేఖ ఇవ్వడానికి రామారావుగారి నివాసానికి వచ్చారు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్లాలని చెప్పడంతో... నేనే తీసుకెళతాను అంటూ హరికృష్ణ బయల్దేరారు. వెంటనే సెక్యురిటీ ఆఫీసర్ కలగజేసుకుని, ‘హరిబాబు గారూ.. మీరు నాగేశ్వరరావుగారి ఇంటికి వెళ్లారని తెలిస్తే, నాన్నగారికి కోపమొస్తుందేమో' అన్నారు. దానికి హరికృష్ణ.... నాన్న గారికి, నాగేశ్వరరావు గారికి విభేదాలుంటే నాకేమిటి. నేనలాంటివి లెక్కచేయను అంటూ తన కారులో శివాజీగణేశన్ను నాగేశ్వరరావు గారి ఇంట్లో దింపడంతో పాటు పది నిమిషాలు మాట్లాడి వచ్చారు. అదీ హరికృష్ణ వ్యక్తిత్వం.... అని గోటేటి రామచంద్రరావు గుర్తు చేసుకున్నారు.

30 లక్షల అప్పుడు అడిగితే.. సరదాగా
‘ఆహ్వానం' హోటల్ నిర్మాణంలో ఉన్న సమయంలో రామారావుగారు దగ్గరకు హరికృష్ణ వచ్చి, హోటల్ మూడవ అంతస్తు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 30 లక్షల రూపాయల అప్పు కావాలని రామారావుని సరదాగా అడిగారు. దానికి రామారావు అంతే సరదాగా స్పందిస్తూ, నన్ను పిలిచి, ‘రామచంద్రరావు, హరికి 30లక్షల రూపాయలు కావాలట, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందీ, మీ దగ్గర ఉంటే మీరే హరికి ఇవ్వండి' అని పెద్దగా నవ్వేశారని... గోటేటి రామచంద్రరావు గుర్తు చేసుకున్నారు. ఆహ్వానం హోటల్ను ఎన్టీఆర్ నిర్మించిన సంగతి తెలిసిందే.

ఆయన ఎన్టీఆర్ కొడుకు, నేను మూమూలు లక్ష్మయ్య చౌదరి కొడుకును
ఓసారి రామారావు కొత్త కారు కొనాలనుకున్నారు. బెంజి కంపెనీ డీలర్ ఓ మోడల్ తీసుకొచ్చి చూపించి ధర చెప్పారు. ‘అమ్మో ఆరు లక్షల 50 వేల రూపాయలా' అని రామారావుగారు అనగానే, మొన్న హరికృష్ణ కూడా ఈ కారును తీసుకున్నారని డీలర్ చెప్పారు. దీనికి రామారావుగారు స్పందిస్తూ ‘ఆయనకేం కొంటాడండీ, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ కొడుకు, నేను మామూలు నందమూరి లక్ష్మయ్య చౌదరి కొడుకుని. నాకు, ఆయనకూ పోలికేంటి' అని నవ్వేశారు. ఆకారు రామారావు కొనలేదు... అని గోటేటి రామచంద్రరావు తన వ్యాసంలో తెలిపారు.


Click it and Unblock the Notifications











