Happy Birthday Ramya Krishnan: నందమూరి హీరోలతో స్పెషల్గా.. ఆ రికార్డు ఈమెకే సొంతం
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ, వారిలో కొందరు మాత్రమే చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించగలిగారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకరు. 80వ దశకంలోనే వెండితెరకు పరిచయం అయిన ఈమె.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్టు, విలన్గా ఇలా ఎన్నో రకాలుగా దక్షిణాది మొత్తంలో తన హవాను చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అదే యాక్టింగ్ను కనబర్చడంతో పాటు ఏమాత్రం తగ్గని గ్లామర్తో సందడి చేస్తున్నారు. ఇక, ఈరోజు ఆమె పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ స్టోరీ మీకోసం!

అలా పరిచయం అయిన రమ్యకృష్ణ
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో మొదట భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాల్లో రమ్యకృష్ణ శిక్షణను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇచ్చారు. అలా దర్శక నిర్మాతల దృష్టిలో పడి 'వెళ్ళై మనసు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'భలే మిత్రులు' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆ సినిమాలతో సౌతిండియన్ స్టార్
సుదీర్ఘమైన కెరీర్లో రమ్యకృష్ణ దాదాపు 300 సినిమాల్లో నటించారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. తన ప్రయాణంలో అన్ని చిత్రాల్లోనూ అత్యుత్తమ నటనతో ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా 'నరసింహా' అనే చిత్రంతో సౌతిండియాను శాసించే స్థాయికి ఎదిగారు. తెలుగులో 'అమ్మోరు' ఆమె ఎవర్గ్రీన్ మూవీ.

అందరితోనూ చేసి.. శివగామి దేవిగా
దాదాపు నాలుగు దశాబ్దాలుగా దక్షిణాదిలో వందల సంఖ్యలో సినిమాలు చేసిన రమ్యకృష్ణ.. అన్ని భాషల్లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించారు. ఫలితంగా ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయిపోయారు. అప్పట్లోనే అందచందాలతో మెప్పించారు. ఇక, 'బాహుబలి'లో శివగామి దేవిగా ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

తెలుగులో నందమూరి ఫ్యామిలీతో
తెలుగులో సీనియర్ల నుంచి ఇప్పటి స్టార్ హీరోల వరకూ రమ్యకృష్ణ చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలతో నటించారు. సీనియర్ ఎన్టీఆర్తో 'మేజర్ చంద్రకాంత్'.. బాలయ్యతో 'బంగారు బుల్లోడు', 'వంశోద్దారకుడు' సహా పలు చిత్రాలు.. తారక్తో 'నా అల్లుడు' మూవీలో నటించి రికార్డు క్రియేట్ చేశారు.

ఆయనతో ప్రేమ వివాహం.. కొడుకు
చాలా కాలం పాటు తన అందంతో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ.. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2003లో వీళ్లిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. వీళ్లకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. వివాహం తర్వాత కూడా రమ్యకృష్ణ కెరీర్కు బ్రేక్ ఇవ్వకుండా వరుస సినిమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ముఖ్యమంత్రిగా మారిన రమ్యకృష్ణ
రమ్యకృష్ణ ఇటీవలే 'క్వీన్' అనే వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇది దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో తెరకెక్కింది. ఇక, ప్రస్తుతం ఆమె సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీలో నటిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేశారు. దీనితో పాటు 'రొమాంటిక్', 'లైగర్' తదితర సినిమాలు చేస్తున్నారు. వేరే భాషల్లోనూ ఫుల్ బిజీగా మారిపోయారు.
చాలా కాలంగా ప్రేక్షకులను మెప్పిస్తోన్న రమ్యకృష్ణ.. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు


Click it and Unblock the Notifications











