హిట్ ఇచ్చిన శ్రీను వైట్లకు రవితేజ అలా చేశాడా?.. 2 కోట్లు ఇవ్వమని..
ఒకప్పుడు ఊరు పేరు లేని హీరోలను స్టార్లుగా మలిచిన ఘనత దర్శకుడు శ్రీను వైట్లది. ప్రిన్స్ మహేశ్బాబుకు దూకుడు రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన రికార్డు ఆయనదే.
ఒకప్పుడు ఊరు పేరు లేని హీరోలను స్టార్లుగా మలిచిన ఘనత దర్శకుడు శ్రీను వైట్లది. ప్రిన్స్ మహేశ్బాబుకు దూకుడు రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన రికార్డు ఆయనదే. టాలీవుడ్ కు భారీ హిట్లను ఇస్తున్నప్పుడు శ్రీను వైట్లకు బ్రహ్మరథం పట్టారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. తీసిన సినిమాలు డిజాస్టర్ల రూపంలో ఆయనను వెక్కిరించాయి. ఫలితం పూలమ్మిన చోటే కట్టెలు అమ్మిన పరిస్థితి ఎదురైంది.
బాగా ఆశలు పెట్టుకొని తీసిన మిస్టర్ సినిమా మళ్లీ నిరాశనే మిగిల్చింది. దాంతో అగ్రదర్శకుడిగా ఉన్న శ్రీను వైట్లకు చాలా మంది ముఖం చాటేశారు. కానీ పడిలేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. తాజాగా శ్రీనువైట్లకు ప్రముఖ నిర్మాణ సంస్థ, స్టార్ హీరో దన్నుగా నిలిచారనే వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నది. ఇంతకీ ఆ కథా కమామీషు ఏమిటంటే..

గడ్డు పరిస్థితిలో శ్రీను వైట్ల
మిస్టర్ పరాజయం తర్వాత శ్రీను వైట్లది చాలా గడ్డు పరిస్థితి. సొంత ఆస్తులు అమ్ముకొన్నారనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా మానసికంగా అనారోగ్యానికి గురయ్యాడని రూమర్ వైరల్ అయింది. ఓ దశలో ఆత్మహత్యకు యత్నించాడనే కథనాలు ఇంటర్నెట్ లో కనిపించాయి. పరాజయాలతో కుంగిపోయి సినీ పరిశ్రమకు దాదాపు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో దూకుడు చిత్రం తీసిన మైత్రీ మూవీస్ ఓ సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

2 కోట్లు అడ్వాన్స్ తీసుకొని..
'దూకుడు' షూటింగ్ సమయంలోనే శ్రీను వైట్ల టాలెంట్ చూసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి రూ. 2 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారట. కానీ పరిస్థితులకు కారణంగా శ్రీను వైట్ల మైత్రీ మూవీస్ కాకుండా వేరే నిర్మాణ సంస్థలకు సినిమా చేసి పెట్టాడు. అయితే ఆ సినిమా అలానే పెండింగ్ లో ఉండిపోయింది. శ్రీను వైట్ల తీసిన సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో సదరు నిర్మాతలు వెనకడుగు వేశారట.

సొమ్ము తిరిగి ఇవ్వాలని..
ప్రస్తుతం ఫెయిల్యూరు రికార్డు ఉన్న శ్రీను వైట్లతో సినిమా తీయడం ఇష్టం లేక అడ్వాన్స్ గా ఇచ్చిన రెండు కోట్లు తిరిగి ఇవ్వాలని మైత్రీ మూవీస్ అధినేతలు అడిగారట. అందుకు తన పరిస్థితి ఇప్పుడు బాగోలేదని, కావాలంటే మరో సినిమా చేస్తానని నిర్మాతలకు స్పష్టం చేశారంట. శ్రీను వైట్ల పరిస్థితిని అర్థం చేసుకుని నిర్మాతలు సానుకూలంగా స్పందించారనేది తాజా సమాచారం.

షరతులకు తల ఊపిన శ్రీను వైట్ల
అయితే సినిమాను భారీ బడ్జెట్ తో కాకుండా తక్కువ బడ్జెట్ తో సినిమాను చేయాలని సూచించారట. ఈ మేరకు హీరోను కూడా సెట్ చేసుకోవాలని మైత్రీ మూవీస్ మేకర్స్ పెట్టిన షరతులకు తల ఊపాడట. ఆ తర్వాత పలువురు హీరోలను సంప్రదించగా తనకు ఆప్తుడైన రవితేజ ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.

హీరోను చేసినందుకు
చిన్న చిన్న పాత్రలు చేస్తూ పరిశ్రమలో కష్టాలు పడుతున్న రవితేజను శ్రీను వైట్ల నీకోసం అనే చిత్రం ద్వారా హీరోను చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంకీ, దుబాయి శీను లాంటి హిట్ చిత్రాలను రవితేజకు అందించి హీరో స్టేటస్ ను కలిపించాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న రవితేజ శ్రీను వైట్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

శ్రీను వైట్లకు గ్రీన్ సిగ్నల్..
ఇటీవల రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథను వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో మైత్రి మూవీ మేకర్స్, శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ మూవీకి రంగం సిద్ధమయ్యిందని తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న శ్రీను వైట్లకు ఊరట కలిగించే విధంగా మైత్రి మూవీ మేకర్స్ రవితేజ కాంబినేషన్ ఓ సినిమాకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ద్వారా అయినా మళ్లీ సక్సెస్ ను అందుకుని శ్రీను వైట్ల నిలదొక్కుకుంటాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











