ఈ హీరోలకు ఏమైంది..? పారితోషికాలు లేకుండా సినిమాలు.. హిట్టు పడితే గానీ..
రంగుల ప్రపంచంలా సినీ ఇండస్ట్రీకి బయటకు కనిపించినా.. లోపల ఉండేవారికి తెలుస్తుంది అందులోని బాధలు. హిట్టు ఉన్నంతవరకే ఎవరైనా.. ఒక్కసారి ఫ్లాప్ పలకరించిందో ఖేల్ ఖతమ్. అలా వరుసగా అపజయాలు చవిచూస్తే.. అప్పటి వరకు న్న బెర్త్ ఖాళీ చేయాల్సిందే. ఎక్కువ కాలం వారికున్న ఫేమ్ను కాపాడుకోలేక.. రొటీన్ సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను విసుగు పుట్టించే హీరోల బాధలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమాలు చేసి పెడుతున్నారట.. ఒకవేళ లాభాలు వస్తే..ఏమైనా మిగిలితేనే ఇవ్వమని అంటున్నారట.. ఒకసారి ఆ హీరోల కథేంటో చూద్దాం.

దీనావస్థలో ఉన్న రవితేజ...
సైడ్ క్యారెక్టర్ నుంచి హీరో.. స్టార్ హీరో రేంజ్కు ఎదిగిన రవితేజ్ కెరీర్ ప్రస్తుతం దీనావస్థలో ఉంది. ఒక్కటంటే ఒక్క హిట్టు కొట్టలేక వెనుకబడిపోతున్నాడు. దెబ్బ మీద దెబ్బ మీదన్నట్లు డిజాస్టర్లే పలకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రాజాది గ్రేట్ మాత్రం కాసింత చెప్పుకోద్దగ్గ సినిమాను చేశాడు. అటుపై ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేదు.

అందుకే పంథా మార్చేశాడు..
చివరగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ నష్టాల నుంచి నిర్మాతలు, బయ్యర్లు ఇంకా తేరుకోనేలేదు. అందుకే రవితేజ కూడా దిగొచ్చాడు. తన కొత్త సినిమా కోసం పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రవితేజ పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటా తీసుకునే షరతు మీదే సినిమా పట్టాలెక్కుతోందని టాక్.

గోపీచంద్ పరిస్థతీ అంతే..
ఒకప్పుడు యాక్షన్ సినిమాలకు, మినిమమ్ గ్యారెంటీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన గోపీచంద్.. ప్రస్తుతం డిజాస్టర్లకు అడ్రస్గా మారిపోయాడు. ఒక్క హిట్టు చూడాలన్న తన కల కలగానే మిగిలిపోయేట్టుంది. అందుకే గోపీచంద్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు.

ఘోర పరాజయం చవిచూసిన చాణక్య
ఇటీవల విడుదలైన చాణక్య కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈలోగా తన చేతిలోని ఓ సినిమా చేజారిపోయింది. ఇలాంటి తరుణంలో గోపీతో సినిమా చేయడానికే నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే గోపీచంద్ ఈ ఆఫర్ ఇచ్చాడని టాక్.
గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికీ గోపీచంద్ పారితోషికం తీసుకోకుండానే పనిచేస్తున్నాడని టాక్.

రాజ్ తరుణ్ గురించి చెప్పనక్కర్లేదు..
కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లను చూసిన రాజ్ తరుణ్.. విజయాన్ని చూసి కొన్నేళ్లు అవుతోంది. కనీసం ఎప్పుడు వచ్చాడు.. ఎప్పుడు పోయాడన్న విషయం కూడా ఎవ్వరికీ తెలీకుండా ఉంది. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్లో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకీ పారితోషికం లేదంటా... కేవలం నెలవారీ ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నాడని టాక్. ఇలా చేయడమే మేలని కొందరు నిర్మాతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి దారుణమైన స్థితిలో ఉన్న హీరోలతో సినిమాలు చేయాలంటే ఆ మాత్రం ఆఫర్లు ప్రకటించాల్సిందే.


Click it and Unblock the Notifications











