‘ఇద్దరమ్మాయిలతో’ మళ్లీ వాయిదా, ఆడియో వైజాగ్లో...
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం విడుదల తేదీ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని మే 10న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అనుకున్న తేదీకి సినిమా పూర్తయ్యే పరిస్థితి లేక పోవడం, ఐపీఎల్ టోర్నీ కూడా జరుగుతుండటంతో మే 24న వాయిదా వేసారు. తాజాగా ఈచిత్రాన్ని మే 31వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
కాగా...ఈ చిత్రం ఆడియోను ఈ సారి హైదరాబాద్లో కాకుండా వైజాగ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 లేదా 28న ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. తన ప్రతి సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లోనే జరుగుతుండటంతో విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ వరకు రాలేక పోతున్నారు. ఈనేపథ్యంలో ఈ సారి అక్కడి అభిమానులను సంతోష పరచడంలో భాగంగా ఆడియో వేడుక అక్కడ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్ర ఆడియో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. . దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంతకు ముందు 'దేశముదురు' చిత్రంలో అల్లు అర్జున్ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో బన్నీని మరో విభిన్నమైన కోణంలో చూపించబోతున్నారు.
బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











