Jamuna.. రాజకీయాల్లో రాణించిన సత్యభామ.. పాలిటిక్స్ల్లో ఎన్టీఆర్ను ఢీకొట్టి.. లోక్సభలో ఎంపీగా!
తెలుగు సినిమా రంగంలో అద్బుతమైన పాత్రలతో దాదాపు ఏడు దశాబ్దాలపాటు ఆకట్టుకొన్న జమున ఇకలేరు. నిరుపేదలు, వద్దంటే డబ్బు. దొంగ రాముడు, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, సతి అనసూయ, ఇల్లరికం, అప్పు చేసి పప్పుకూడు. మూగ మనుషులు, రాముడు భీముడు, దొరికితే దొంగలు లాంటి మరుపురాని చిత్రాల్లో తనదైన హావభావాలు, నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు. ప్రముఖ నటి జమున సినీ, రాజకీయ జీవిత విశేషాల్లోకి వెళితే..

7 దశాబ్దాల కాలంలో
జమున గత ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 200 చిత్రాల్లో నటించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు. హిందీలో డజనుకుపైగా చిత్రాల్లో నటించారు. మిస్ మేరీ సినిమా ద్వారా హిందీలోకి ప్రవేశించారు. ఆమె నటించిన ఏక్ రాజ్, హమ్రాయి, బేటీ బేటే, రిస్తే నాతే, మిలన్, లేడీ టార్జాన్, రాము దాదా, దుల్హన్, నౌకర్ బీవీకా, రాజ్ తిలక్ చిత్రాల్లో నటించారు. మిలన్ చిత్రంలో ఆమె అద్బుతమైన నటనకు గాను.. ఫిల్మ్ ఫేర్ అవార్డుల లభించింది.

జమున సాధించిన అవార్డులు
జమున తన కెరీర్లో అవార్డులు, రివార్డులు అందుకొన్నారు. 1968లో మిలన్ సినిమాలో ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకొన్నారు. 1972లో ఫిల్మ్ఫేర్ స్పెషల్ అవార్డు, 1999లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ హానరరీ అవార్డు, 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, 2010లో పద్మభూషణ్ డాక్టర్ బీ సరోజాదేవీ అవార్డు, 2019లో సంతోషం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకొన్నారు.

ఎన్టీఆర్తో ఎక్కువ సినిమాలు
తెలుగు సినిమా పరిశ్రమలో జమున తన కెరీర్లో ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్నాఆర్తో ఎక్కువ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, జమున జోడి హిట్ పెయిర్గా నిలిచింది. వారిద్దరి జోడికి తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఎన్టీఆర్తో దాదాపు 30 సినిమాల్లో నటించారు.

సత్యభామకు మరోపేరుగా
పౌరాణిక సినిమాల్లోనే కాకుండా సాంఘీక కథా చిత్రాల్లో జమున తిరుగు లేని నటిగా రుజువు చేసుకొన్నారు. తెలుగు తెరపై సత్యభామ అంటే జమున తప్ప మరో గుర్తుకు రారు. సత్యభామ పాత్రతో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకొన్నారు. అప్పట్లో హీరోయిన్ ఓరియెంట్ చిత్రాల్లో నటించి తన స్టార్ స్టామినాను రుజువు చేసుకొన్నారు.

ఎన్టీఆర్తో సన్నిహితంగా.. రాజకీయాల్లో అలా
అయితే తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్తో అత్యంత సన్నిహితంగా, స్నేహితులుగా ఉన్న జమున.. రాజకీయాల్లో ఆయనను తీవ్రంగా విభేదించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే.. జమున కాంగ్రెస్ పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్తో రాజకీయ పరంగా విబేధించడం చర్చనీయాంశమైంది.

రాజమండ్రి నుంచి ఎంపీగా
నటిగా విశేష ఆదరణను సొంతం చేసుకొన్న జమున రాజకీయాల్లో కూడా స్వల్పంగా రాణించారు. 1980లో కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగించారు. 1989లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ చేతిలో ఆమె ఓటమి చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. వాజ్పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలో బీజేపీకి ప్రచారం చేశారు.


Click it and Unblock the Notifications











