అన్నం పెట్టి గొంతు కోస్తున్నారు.. రక్తం ధారపోశాం.. పెళ్లాల పుస్తెలు తాకట్టు.. జవాన్ దర్శకుడు రవి
Recommended Video

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, టాలీవుడ్ గోల్డెన్ లెగ్ మెహ్రీన్ ఫిర్జాదా నటించిన జవాన్ చిత్రం రిలీజై ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది. రిలీజ్ రోజే ఈ చిత్రం పైరసీ కోరల్లో చిక్కుకొని ఇంటర్నెట్ మాధ్యమాల్లో ప్రసారం కావడంపై దర్శకుడు బీవీఎస్ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. పైరసీ పాల్పడుతున్న వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మనస్తాపానికి గురయ్యాడు. పైరసీ వల్ల నిర్మాతలు, పంపిణీదారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జవాన్ చిత్రంపై పైరసీ కాటు
జవాన్ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకులు సినీ విమర్శకులు నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదలైన వెంటనే జవాన్ పైరసీ కాటుకు గురైంది. దాంతో తమ సంతోషం ఆవిరైపోయింది. అప్పుడే బస్సులో కూడా సినిమాను ప్రదర్శిస్తున్నారు అని బీవీఎస్ రవి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముందుగా మంచి సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నారు.

గాలిలో దీపంలా జవాన్ సినిమా
ఓ మంచి సినిమా తీశామని అందరిచేత ప్రశంసలు అందుకోవాలి. రొటీన్ చిత్రం కాకుండా మంచి సందేశంతో కూడిన జవాన్ సినిమా తీశాను. అలాంటి చిత్రాన్ని చేయడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. కానీ పైరసీ వల్ల సంతోషం గాలిలో పెట్టిన దీపంలా మారింది అని రవి చెప్పారు.

రక్తం ధారపోసి సినిమా తీశాం
మేము ఎంతో కష్టపడి, రెండేళ్లపాటు కథ రాసుకున్నాం. అలాంటి కథను ఒక హీరోకు ఒప్పించి సినిమా తీశాం. జవాన్ విషయంలో సాయిధరమ్ తేజ్ అందించిన సహకారం మరువలేనిది. ప్రొడ్యూసర్ల డబ్బును కుమ్మరించి సినిమా చేశాం. ఈ సినిమా కోసం కష్టపడిన విధానాన్ని మాటల్లో చెప్పాలంటే రక్తం ధారపోశాం అని చెప్పవచ్చు. జవాన్ మేకింగ్ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది అని దర్శకుడు రవి పేర్కొన్నారు.

ల్యాప్టాపుల్లో జవాన్ సినిమా
జవాన్ చిత్రాన్ని చూసిన తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులు కూడా బాగా స్పందించారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు. విడుదలైన మధ్యాహ్నానికే జవాన్ సినిమా ల్యాప్టాప్లలోకి వచ్చింది. నోట్లో అన్నం పెట్టి గొంతు కోసేసినట్టుగా ఉంది మా పరిస్థితి. ఇంత కష్టపడిన తర్వాత కూడా ఫలితమనే ఆహారాన్ని కడుపులోకి వెళ్లకుండా చేస్తున్నారు అని రవి ఆవేదన వ్యక్తం చేశారు.

పైరసీతో మా పరిస్థితి అధ్వాన్యంగా
పైరసీ వల్ల మా పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. బాగా చదివిన విద్యార్థి పరీక్ష రాసి తన ప్రతిభను నిరూపించుకొనే నేపథ్యంలో ప్రశ్నాపత్రం ముందే లీకై ఏమీ రాని విద్యార్థి టాప్ ర్యాంక్ కొట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మా పరిస్థితి. ఏడాదికి 100 సినిమాలు తీస్తే 20 చిత్రాలు ఆడుతున్నాయి. అందులో 10 సినిమాలకే డబ్బులొస్తున్నాయి అన్నారు.

భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి
డిస్ట్రిబ్యూటర్లు తమ భార్య మెడలో ఉన్న పుస్తెలను తాకట్టుపెట్టి సినిమాలకు డబ్బు పెడుతుంటారు. ప్రేక్షకులకి మంచి సినిమా చూపించాలని లైట్బాయ్ నుంచి థియేటర్ దగ్గర సైకిల్ స్టాండ్ నడిపే వారు కూడా కష్టపడుతుంటారు. శుక్రవారం వస్తుందంటే భయమేస్తుంది. ఈ వారం ఏ నిర్మాత రోడ్డున పడతాడో అని అని బీవీఎస్ రవి ఆందోళన వ్యక్తం చేశారు.

ఎయిడ్స్ కంటే పైరసీ భయంకరం
ఎంత కష్టపడి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న గానీ మేము పైరసీ రోగం నుంచి బయటపడటం లేదు. ఈ పైరసీ ఎయిడ్స్ కంటే భయంకరమైనది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే పరిశ్రమలో మాలాంటి వాళ్లు అడ్రస్ లేకుండా పోతారు. పైరసీని ఆడ్డుకోకపోతే జీవితాలు రోడ్డున పడతాయి. వెంటనే పైరసీ నిరోధక అధికారులు తగిన విధంగా స్పందించాలి అని బీవీఎస్ రవి సూచించాడు.


Click it and Unblock the Notifications











