‘పిచ్చాసుపత్రికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ’
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వర్మ తీస్తున్న ‘వంగవీటి' మూవీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉందని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ వర్గాల భగ్గుమన్నాయి. వర్మ మానసిక స్థితి సరిగా లేదని, వెంటనే అతన్ని విశాఖ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించుకోవాలని... ఆసుపత్రి సూపరిండెంట్కు వినతి పత్రం ఇచ్చారు.
రామ్ గోపాల్ వర్మ తాను తీస్తున్న ఏ సినిమాకైనా మొదట వివాదాలతో పబ్లిసిటీ పెంచే ప్రయత్నం చేస్తారు. తాజాగా ‘వంగవీటి' సినిమా విషయంలో కూడా ఆయన అదే దారి అనుసరిస్తున్నారు. వంగవీటి చిత్రం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ హైప్ తేవాలని మాత్రం ఓ రేంజిలో కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కమ్మ, కాపు కులాల మధ్య జరిగే ఆధిపత్య పోరును ఈ సినిమాలో వర్మ ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ నేతలు ఆగ్రహానికి గురవడానికి కారణమైన ‘వంగవీటి' సినిమా గురించి వర్మ చేసిన తాజా ప్రకటన ఇలా ఉంది...
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా , నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు,చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే. నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న "వంగవీటికి" ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా.
పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్,శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ,ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు ... రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు.
ఫాక్షనిజం కి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీయిజానికి వారసత్వం దమ్ము. ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. "వంగవీటి" చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది..
"శివ" తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం "వంగవీటి"తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం "వంగవీటి" కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. వంగవీటి రాధాగారు,చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే "వంగవీటి" చిత్రం.
కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి, సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటివిజయవాడ వాతావరణాన్ని పునసృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని "వంగవీటి" నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా"వంగవీటి" యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోంది.
వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రదారులు వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగా, వంగవీటి రత్నకూమారి, దేవినేని నెహ్రు, దేవినేని గాంధీ, దేవినేని మురళి, కర్నాటి రామమోహనరావు, సిరిస్ రాజు, రాజీవ్ గాంధీ, దాసరి నారాయణ రావు, ముద్రగడ పద్మనాభం, నందమూరి తారక రామారావు, రామ్ గోపాల్ వర్మ తదితరులు అని వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











