కళాతపస్వి కే విశ్వనాథ్కు దాదా సాహెబ్ ఫాల్కే
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్కు లభించింది.
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావులను ఈ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. విశ్వనాథ్కు అవార్డు ప్రకటించిన విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. 2016 సంవత్సరానికి గానూ విశ్వనాథ్కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు.
మంత్రి వెంకయ్యనాయుడు ట్వీట్
కళా తపస్వి విశ్వనాథ్కు అభినందనలు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ అవార్డు ప్రకటించింది అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఫాల్కే అవార్డుకు ఎంపికైన కళా తపస్విని ఆయన అభినందించారు.

ఆత్మగౌరవంతో దర్శకుడిగా..
1957లో ‘తోడికోడలు' చిత్రంతో సౌండ్ విభాగంలో సినీ కెరీర్ను ప్రారంభించారు. ‘ఆత్మగౌరవం' చిత్రం ద్వారా తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడయ్యారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో శంకరాభరణం వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఆ చిత్రం ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది ఆ చిత్రం.

ఆణిముత్యాల్లాంటి సినిమాలు..
దేశం గర్వించ దర్శకుల్లో ఒకరైన విశ్వనాథ్ శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శృతిలయలు', సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి మరెన్నో అణిముత్యాల్లాంటి తెలుగు సినిమాలను ఆయన అందించారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది.

ఆస్కార్ వైపు..
‘స్వాతిముత్యం' సినిమా ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందడం విశేషం. భారతీయ సినిమాకు విశ్వనాథ్ చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన విశ్వనాథ్ నటుడిగానూ తనదైన ముద్రవేశారు.

1930లో గుడివాడలో జన్మించిన..
ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో 1930లో జన్మించారు. కళాత్మక, సంగీత, నృత్య ప్రాధాన్యం ఉన్న అనేక చిత్రాలను తీశారు. 1992లో ఆయన పద్మశ్రీ అందకున్నారు. అయిదుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిల్మ్ కేటగిరీలో 20 నంది అవార్డులు గెలుచుకున్నారు. పదిసార్లు ఫిల్మ్ అవార్డు కూడా గెలిచారు.

మే 3వ తేదీన ప్రధానం..
2016 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. మే 3 న జరుగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా కే విశ్వనాథ్ పురస్కారాన్ని అందుకుంటారు.

స్వర్ణ కమలం. పది లక్షల నగదు..
భారతీయ చలనచిత్ర అభివృద్ధికి కృషి చేసినందుకు గాను విశ్వనాథ్ ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కింద ఆయనకు స్వర్ణ కమలాన్ని బహూకరిస్తారు. దీంతో పాటు పది లక్షల నగదును అందజేస్తారు. శాలువాతో సత్కరిస్తారు. 1965 నుంచి విశ్వనాథ్ సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అరుదైన గౌరవం
భారతీయ సినిమా పరిశ్రమకు విశేష సేవలందించిన కళా తపస్వి విశ్వనాథ్కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేయడంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందించారు. కళా తపస్వికి దక్కిన అరుదైన గౌరవమని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
రాజ్యవర్థన్ రాథోడ్ హర్షం
ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్కు ఫాల్కే అవార్డు ప్రకటించడంపై కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశాడు. విశ్వనాథ్ తీసిని శంకరాభరణంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

ఆరుగురికి అరుదైన గౌరవం
ఇప్పటివరకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆరుగురు తెలుగు సినీ ప్రముఖులకు దక్కింది. ఈ అవార్డును దక్కించుకొన్న వారిలో బీ నరసింహరెడ్డి, ఎల్వీ ప్రసాద్, బీ నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వర్ రావు, డీ రామానాయుడు ఉన్నారు. తాజాగా కే విశ్వనాథ్కు ఈ అవార్డును కేంద్ర ప్రకటించింది.
ఫాల్కే అవార్డు అందుకొన్న వారు వీరే..
1. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974)
2. ఎల్వీ ప్రసాద్ (1982)
3. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986)
4. అక్కినేని నాగేశ్వరరావు (1990)
5. డీ రామానాయుడు (2009)
6. కే విశ్వనాథ్ (2016)

నా తల్లిదండ్రుల దీవెనలు..
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రుల దీవెనలు ఫలించాయి అని ప్రముఖ సినీ దర్శకుడు కే విశ్వనాథ్ అన్నారు. 2016 సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తనను ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











