‘కాలా’పై నిరసన: బెంగుళూరులో పోస్టర్లు దహనం, డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుపై దాడి
'కాలా' సినిమా విడుదల నేపథ్యంలో కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఆందోళనకారులు బెంగుళూరులో 'కాలా' ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుపై దాడి చేశారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్లను దహనం చేశారు. కన్నడిగుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన రాజనీకాంత్ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ కర్నాటకలో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు.
కావేరి జలాల విషయంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగులుతున్న వివాదంలో రజనీకాంత్ గతంలో చేసిన వ్యాఖ్యలు తమిళనాడుకు మద్దతుగా ఉండటంతో కన్నడిగులు ఆయన నటించిన 'కాలా'పై తమ ప్రతాపం చూపించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని నిషేధించాలనే ఆందోళనలు తీవ్రతరం చేశారు.

తమ సినిమాను విడుదల చేయలేని పరిస్థితి ఉండటంతో నిర్మాత ధనుష్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా 'కాలా సినిమా ప్రదర్శన సజావుగా జరిగేలా చూడాలని, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది, సుప్రీం కోర్టు నుండి కూడా 'కాలా' సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జూన్ 7న కర్నాటకలో పోలీసు భద్రత మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
కర్నాటకలో 'కాలా' విడుదలపై వివాదం రగులుతున్న నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. 'కాలా' మూవీ విడుదలకు సంబంధించి కోర్టు ఆదేశాలు అమలు పరుస్తామని, ముఖ్యమంత్రిగా అది తన బాధ్యత అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కర్నాటకలో 'కాలా' విడుదల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచిది కాదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications











