Kaikala Satyanarayana: నట దిగ్గజానికి అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది సినీ ప్రముఖులు తుది శ్వాస విడిచారు. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు, నట శేఖర కృష్ణ వంటి దిగ్గజ నటులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. దీంతో చిత్ర రంగానికి తీవ్ర లోటు ఏర్పడింది. ఇప్పుడు డిసెంబర్ 23న మరో నట శిఖరం నేలకొరిగింది. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా టాలీవుడ్లో నటుడిగా తన సత్తా చాటి లెజెండరీ యాక్టర్గా పేరొందిన కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఇక ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.

దాదాపుగా 777 చిత్రాల్లో..
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్లలో ఒకరైన కైకాల సత్యనారాయణ శకం తెలుగు సినిమా పరిశ్రమలో ముగిసిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం అంటే డిసెంబర్ 23న తెల్లవారుజామున కన్నుమూశారు. సుమారు 6 దశాబ్దాలకుపైగా చిత్రసీమలో రాణించిన కైకాల సత్యనారాయణ దాదాపుగా 777 చిత్రాల్లో నటించారు. ఇక ఆయన లేరనే విషయం తెలుగు సినీ వర్గాలు, ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది.

యంగ్ హీరోల నుంచి..
కైకాల సత్యనారాయణ మరణంతో తెలుగు చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త ఇటు సినీ పరిశ్రమలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్నే నింపింది. ఇక, ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, సినీ నటులు సందర్శనార్థం ఆయన నివాసం వద్దే ఉంచారు. కైకాల సత్యనారయణ మృతిపట్ల టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ నుంచి యంగ్ హీరోల వరకు తమ సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుభూతులను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.

మహా ప్రస్థానంలో అంత్యక్రియలు..
ఇక ఇదిలా ఉంటే తెలుగు దిగ్గజ నటుడు, నట సార్వభౌముడికి అంతిమంగా కన్నీటి వీడ్కోలు చెప్పారు. శనివారం ఉదయం కైకాల నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. తర్వాత జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

చదువుకుంటున్న రోజుల్లోనే..
కైకాల సత్యనారాయణ 1935లో కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరులో జన్మించారు. గుడివాడలో డిగ్రీ పూర్తి చేశారు. చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన ఎక్కువగా నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. డిగ్రీ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సిపాయి కూతురు అనే సినిమాతో తెరంగేట్రం చేశారు కైకాల సత్యనారాయణ. పౌరాణికం, జానపదం, కమర్షయిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన జోనర్స్ లో తనదైన స్టైల్ లో నటనతో ముద్ర వేసుకున్నారు కైకాల సత్యనారాయణ.

అలనాటి హీరోలతోనే కాకుండా..
సుమారు 777 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సోపోర్టింగ్ రోల్స్ తో తనకు తానే సాటి అనిపించుకున్నారు. అంతకుమించి యముడు అంటే తెలుగు ఇండస్ట్రీలో కైకాల సత్యతనారాయణ తర్వాతే ఎవరైనా అనేంతగా పేరు సపాదించుకున్నారు. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వారితోనే కాకుండా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలతో కూడా నటించారు.

కళ్లముందే కదలాడుతున్నాయి..
కైకాల సత్యనారాయణ చివరిగా మహేశ్ బాబు మహర్షి సినిమాలో కనిపించారు. కైకాల గురించి మహేశ్ బాబు ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ గారి మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆయనతో నాకు అనేక అనుభూతులు ఉన్నాయి. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలు కళ్లముందు కదలాడుతున్నాయి. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయన శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











