ఎన్టీఆర్, కళ్యాణ్ లతో కలిసి జానకి రామ్ ఇలా...(ఫొటో)
హైదరాబాద్ :రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి జానకిరామ్ తో కలిసి ఆయన సోదరులు ఇలా ఫొటో దిగారు. వీరి బ్యా్క్ గ్రౌండ్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఆయన సతీమణి బసవతారకం ఉన్నారు. సంతోషంగా వీరంతా కలిపి తీయించుకున్న ఈ ఫొటో ఇప్పుడు అందరి మనస్సులని కలిచివేస్తోంది.
మొయినాబాద్ మూర్తుజగూడలోని హరికృష్ణ వ్యవసాయక్షేత్రంలో జానకిరామ్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, జానకిరామ్ తముళ్లు కళ్యాణ్రామ్, తారకరత్న జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సంతాపం తెలిపారు.
శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణపెద్ద కుమారుడు జానకిరాం దుర్మరణం పాలయ్యారు. జానకిరాం స్వయంగా
నడుపుతున్న వాహనం నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలో రాంగ్రూట్లో వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. చికిత్స అందించేలోపే ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఆయన వాహనం నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల సమీపంలో ప్రమాదానికి గురైంది.
తీవ్రంగా గాయపడ్డ జానకిరాంను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించేలోపే తుదిశ్వాస వదిలారు. నందమూరి జానకిరాం శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తాను ఒక్కరే బయలుదేరారు. ఏపీ 29 బీడీ 2323 టాటా సఫారీని స్వయంగా నడుపుతూ వెళ్లారు. హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి-65పై 170 కిలోమీటర్లపాటు ప్రయాణించారు. మరో ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే కోదాడ వస్తుంది. జానకిరాం టాటా సఫారీని గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుపుతున్నారు. అప్పటికి సాయంత్రం 6.30 గంటలు అవుతోంది. చీకట్లు అలుముకుంటున్నాయి.
ఇంతలో... ఎదురుగా, రాంగ్రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఒకటి ప్రత్యక్షమైంది. హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు ఎక్కేందుకు మళ్లుతోంది. పక్కకు తప్పించే మార్గం కనిపించలేదు. అంత సమయమూ లేదు! జానకిరాం టాటా సఫారీ నేరుగా వెళ్లి ట్రాక్టర్ ట్రాలీని ఢీకొంది. భారీ శబ్దం... సఫారీ నుజ్జునుజ్జుగా మారింది. ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీ వేరై చెల్లాచెదురయ్యాయి. దీంతో కారు మూడు పల్టీలు కొట్టింది. వాహనం స్టీరింగ్ బలంగా ఒత్తుకుపోవడంతో జానకిరాం పక్కటెముకలు, కుడిచేయి విరిగిపోయాయి. ఛాతీపై రక్తగాయాలయ్యాయి. జానకిరాం తన వాహనంలోనే ఇరుక్కుపోయారు.
వాహనంలో ఆయన ఒంటరిగా ఉన్నారు. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు అటువైపుగా ద్విచక్ర వాహనంలో వెళ్లిన వెంకటేశ్ అనే యువకుడు... భారీ శబ్దం వినిపించడంతో వెనుతిరిగి చూశాడు. చెల్లాచెదురైన ట్రాక్టర్, సఫారీ వాహనాలు కనిపించాయి. ఆయన హుటాహుటిన బైక్ను వెనక్కి తిప్పి సంఘటన స్థలానికి వచ్చారు. ట్రాక్టర్ ఉందికానీ... దాని డ్రైవర్గానీ, ఇతర వ్యక్తులుకానీ కనిపించలేదు. ఇక... సఫారీలో డ్రైవర్ సీటులో జానకిరాం కనిపించారు. జానకిరాంను కాపాడేందుకు ప్రయత్నించారు. తాను నందమూరి హరికృష్ణ కుమారుడిని అని చెబుతూ ఆయన అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

ఈలోపు మరికొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. 108కు సమాచారం అందించారు. జానకిరాంను వాహనం నుంచి బయటికి తీశారు. అక్కడే ఉన్న ఆయన సెల్ఫోన్ తీసుకుని... ఇన్కమింగ్ జాబితాలో ఉన్న నెంబర్కు ఫోన్ కాల్ చేశారు. అది... జానకిరాం సోదరుడు, సినీ హీరో నందమూరి కల్యాణ్రామ్కు వెళ్లింది. ప్రమాద సమాచారాన్ని వారు కల్యాణ్రామ్కు అందించారు. ఈలోపు 108 వాహనం వచ్చింది. జానకిరాంను తొలుత కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కోదాడలోనే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే... జానకిరాం అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
జానకిరాం మృతదేహాన్ని తొలుత పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. అప్పటికే అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపారు. కోదాడలో సరైన సౌకర్యాలు లేవని, అభిమానుల తాకిడివల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. హైదరాబాద్లోనే పోస్టుమార్టం నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. దీంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకరరావుతో ఫోన్లో మాట్లాడారు.
హైదరాబాద్లో పోస్టుమార్టంకు అనుమతించాలని కోరారు. ఇందుకు వీరు అంగీకరించారు. దీంతో జానకిరాం మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో పోలీసు బందోబస్తు నడుమ హైదరాబాద్ తరలించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఫోరెన్సిక్ విభాగం నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల సమయంలో జానకిరాం మృతదేహాన్ని మాసబ్ట్యాంక్లోని హరికృష్ణ నివాసానికి తరలించారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జానకిరాంకు నివాళలు అర్పించారు. జానకిరాంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక ఒకఒకకుమారుడికి తాత ‘నందమూరి తారకరామారావు' పేరు పెట్టుకున్నారు. మరోకుమారుడి పేరు సౌమిత్ర. జానకిరాం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై తన సోదరుడు కల్యాణ్రాం హీరోగా ‘అతనొక్కడే' చిత్రాన్ని నిర్మించారు. ఆయన అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. మరోవైపు... నందమూరి హరికృష్ణ తనయుడు మృతి వార్త తెలియగానే సంఘటన స్థలానికి వివిధ గ్రామాల నుంచి జనం పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే...
గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న అనే రైతు ఆకుపాముల సమీపంలో వరి నారు కొనుగోలు చేశారు. నారును ట్రాక్టర్లో లోడ్ చేసి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. పద్ధతి ప్రకారం... తన ఊరు చేరుకునేందుకు విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, యూటర్న్ తీసుకోవాల్సి ఉంది. అయితే... ఇలాగైతే రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో, రాంగ్రూట్లో వస్తూ డివైడర్ వద్ద హైదరాబాద్ రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ట్రాక్టర్ ఇంజన్ ముందుకు వెళ్లింది. ట్రాలీ మాత్రం విజయవాడవైపు వెళ్లే రోడ్డుపై మిగిలింది. జానకిరాం సఫారీ ఈ ట్రాలీనే ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్నకు ఎలాంటి గాయాలూ కాలేదు.


Click it and Unblock the Notifications











