కమల్ హాసన్ కరెక్టు ఛాయిస్
హైదరాబాద్ : బుధవారం నుంచి ఫ్రాన్స్లో ప్రారంభమవుతున్న 67వ కేన్స్ చిత్రోత్సవాల్లో కమల్ హాసన్ సందడి చేయబోతున్నారు. ఇండియన్ పెవిలియన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) తొలిసారిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తరఫున కేన్స్లో సమన్వయకర్తగా వ్యవహరించబోతోంది. కమల్ హాసన్ ని కేన్స్ కు ఎంపిక చేయటం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు...ఆయనే కరెక్టు ఛాయిస్ అంటున్నారు.
ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ (దక్షిణాది)కి ఛైర్మన్గా ఉన్న కమల్ ఆ హోదాలోనే ఇండియన్ పెవిలియన్ని ప్రారంభించబోతున్నారు. ఆయనతోపాటు ఫ్రాన్స్లో ఉంటున్న భారత రాయబారి అరుణ్ కె.సింగ్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ బిమల్ జుల్కా, మార్చె డు ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెరోమ్ పైల్లార్డ్, నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఫిక్కీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కమల్ హాసన్ మాట్లాడుతూ ''గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాల్ని అందులోనూ దక్షిణాది చిత్రాల్ని కేన్స్ చిత్రోత్సవాలకు ఆహ్వానించి గౌరవిస్తున్నారు. ఈసారి మనదేశం తరఫున డెలిగేట్ హోదాలో నేను కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచ సినిమాకు మన భారతీయ సినిమా గురించి చెప్పేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. అక్కడ నా ప్రసంగంలో గత అయిదేళ్లుగా దక్షిణాది పరిశ్రమ ఉన్నతికి ఫిక్కీ ఎలా తోడ్పాటు అందిస్తున్నదీ కూడా చెప్పబోతున్నాను''అని తెలిపారు.

ఇక కమల్ హాసన్ ప్రస్తుతం బెంగళూరులో ఉత్తమవిలన్ షూటింగ్ లో బిజిగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయ్యాక దృశ్యమ్ చిత్రం రీమేక్ చేస్తారు. రోజురోజుకూ వేగాన్ని పెంచుతున్న ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్గా కమల్ నటించిన 'విశ్వరూపం-2' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల చెంతకు రానుంది.
తన స్నేహితుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్హాసన్ నటిస్తున్న 'ఉత్తమ విలన్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమయి శరవేగంగా కొనసాగుతోంది. దీని చిత్రీకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట రమేష్ అరవింద్. సెప్టెంబరులో చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు నిశ్చయించారట. కమల్ నటించనున్న మూడో చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మలయాళంలో సంచలన విజయం సాధించిన 'దృశ్యం' రీమేక్లో కమల్ నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటించేందుకు మీనా, నదియా, సిమ్రాన్ తదితర పేర్లు పరిశీలనకు వచ్చినా చివరకు గౌతమిని ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఉత్తమ విలన్' చిత్రీకరణ పూర్త్తెన వెంటనే ఆగస్టులో 'దృశ్యం' రీమేక్ను సెట్స్పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. చిత్రీకరణకు ఎక్కువరోజులు పట్టే కథ కాకపోవటంతో త్వరగానే పూర్తి చేసి డిసెంబరులోగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











