కమల్ హాసన్ ఎమోషనల్ స్పీచ్ (మొత్తం)
చెన్నై : విశ్వరూపం సినిమా ప్రదర్శనపై మద్రాసు హైకోర్టు మళ్లీ నిషేధం విధించడంతో కమల్హాసన్ పూర్తిగా విసిగిపోయారు. తీర్పు ప్రకటించడానికి ముందే చెన్నైలో తాను పుట్టి పెరిగిన ఆళ్వార్పేట నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఉద్వేగభరితంగా మాట్లాడారు. తమిళనాడునే కాదు.. అవసరమైతే భారతదేశాన్నే వీడిపోతానని చెమర్చిన కళ్లతో తమిళంలో మాట్లాడుతూ చెప్పారు. ఆయన చెప్పింది ఉన్నదిఉన్నట్లుగా...
కమల్ మాటల్లో... "జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తమిళనాడు నన్ను వద్దనుకుంటోందేమో అనిపిస్తోంది. నేను ఎక్కడికెళ్లినా బతకగలను. నాకు మతసామరస్యం ఉన్న ప్రాంతం కావాలి. అది తమిళనాడులో లేదనుకుంటే, కాశ్మీర్ నుంచి కేరళ వరకు వెతుకుతా. అక్కడా లేకపోతే దేశం వదిలిపోతా. ఇంతకుముందు ఎంఎఫ్ హుస్సేన్ ఇలాగే దేశం వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు నాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చినట్లుంది.
విశ్వరూపంపై నిషేధం విధిస్తే ఇక వెళ్లిపోతా.ఎక్కడికెళ్లినా నేను భారతీయుడ్నే, తమిళుడినే. పాస్పోర్టు మారుతుందంతే. తమిళ సినిమా నా ప్రాణం. సినిమా కోసమే నేను. రాబోయే రెండు రోజుల్లో నేను దేశంలో ఏదైనా లౌకిక రాష్ట్రం ఉందో లేదో చూసుకుంటా. లేకపోతే వేరే లౌకిక దేశం వెతుక్కుంటా. నేను వెళ్లిన చోట ఉండటానికి గూడు ఉండకపోవచ్చు. కానీ, నాకు అన్నం పెట్టగల ఇళ్లు చాలా ఉంటాయి. నాకు ఈ విషయాలు అర్థం కావట్లేదు. అర్థమైతే నేను రాజకీయ నాయకుడిని అయి ఉండేవాడినేమో'' అన్నారు.
కొంచెం ఉద్వేగంగా, మరికొంచెం ఆక్రోశంగా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. "రాజా పార్వాయ్ చిత్రం నిర్మించినప్పుడు నేను దివాలా తీశాను. నష్టాల నుంచి కోలుకోడానికి నాకు ఎనిమిదేళ్ల సమయం పట్టింది. మరోసారి 1986లో తీవ్రంగా నష్టపోయాను. అయినా.. ఎప్పటికప్పుడు కోలుకుంటూ మళ్లీమళ్లీ వస్తున్నాను. నేను ఒంటరివాడినని, కూల్చేద్దామని చాలామంది చూస్తున్నారు. కింద పడినా భూమి పొరల్లోంచి చీల్చుకువచ్చే విత్తనాన్ని నేను. విత్తనమే కదా అని చిన్నచూపు చూసేవాళ్లూ ఉన్నారు. కానీ, నేను పెరిగి ఒక మహావృక్షాన్నై కొన్ని వందల పక్షులకు ఆశ్రయమిస్తా. నాలాంటి వృక్షాలతో ఒక అడవిని సృష్టిస్తా.
నాకు కులమతాలు లేవు. మానవత్వమే ఉంది. ప్రస్తుతానికి డబ్బుకూడా లేదు. గౌరవనీయులైన న్యాయమూర్తి ఒక మనిషి సంపాదనకు ప్రాముఖ్యమివ్వడం ముఖ్యమా? దేశ సమైక్యతకు ప్రాముఖ్యమివ్వడం ముఖ్యమా? అని ప్రశ్నించారు. కచ్చితంగా దేశ సమైక్యతే నాకు ముఖ్యం. అందుకోసం మొత్తం ఆస్తిని కోల్పోవడానికి కూడా నేను సిద్ధమే. నా ఇంటితో సహా.. చెన్నైలో ఉన్న ఆస్తులన్నింటినీ పెట్టి తీసిన సినిమా ఇది. విడుదల వాయిదా పడుతుండడంతో ఆ ఆస్తులన్నీ రాసిచ్చేశాను. అయినా సంతోషంగానే ఉన్నా.
ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ ఇల్లు మా నాన్న గుర్తు. ఇదే ఇంట్లో కూర్చుని ముఖ్యమంత్రులతో మాట్లాడాను, గొప్ప గొప్ప కళాకారులతో ముచ్చటించాను. ఇప్పుడీ ఇంటిని కూడా సినిమా కోసం రాసిచ్చేశా. తీర్పు నాకు వ్యతిరేకంగా వస్తే మరుక్షణం ఈ ఇల్లు నాది కాదు. ఆస్తులు పోయినా, డబ్బులు పోయినా నా దగ్గర ప్రతిభ ఉంది. నాకు రాజకీయాలు తెలియవు. 'విశ్వరూపం' ఇండియన్ ముస్లింలకు సంబంధించిన సినిమా కాదు. థియేటర్లకు వెళ్లిన అభిమానులను, ప్రేక్షకులను కూడా గెంటేస్తున్నారు'' అని కమల్హాసన్ వాపోయారు.


Click it and Unblock the Notifications











