యూఎస్ఏలో భారీగా విడుదలవుతున్న కంచె
హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంచె' చిత్రం ఈ నెల 22న దసరా కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యూఎస్ఏలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 130కి పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు.
అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘అఖిల్' చిత్రం దసరా బరి నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో అక్టోబర్ 22న వరుణ్ తేజ్ సినిమా ‘కంచె' విడుదలవుతోంది. వాస్తవానికి అక్టోబర్ 2నే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలతో నవంబర్ 6కు వాయిదా పడింది. అయితే పరిస్థితులు కలిసి రావడంతో అనుకున్న దానికంటే ముందే కంచె రిలీజ్ అవుతోంది.

‘కంచె' మూవీ ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. మరో వైపు రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమా ఈ రోజు విడుదలైంది. కేవలం వారం గ్యాపుతో ‘కంచె' విడుదలవుతుండటం గమనార్హం. మరి అన్నయ్య రామ్ చరణ్ కు వరుణ్ తేజ్ బాక్సాఫీసు వద్ద ఎలా పోటీ ఇస్తాడో చూడాలి.
తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ‘కంచె'. ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. 'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా 'కంచె'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ దత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











