Don't Miss!
- Finance Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
- News టీడీపీ ఆశలపై "స్వామిజీ" నీళ్లు - మారుతున్న లెక్కలు..!!
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
డబ్బంగ్ చిత్రాలదాడి....బంద్కు పిలుపు
బెంగళూరు: అనుమతి రావడమే ఆలస్యం విడుదల చేసేందుకు తమిళం, హిందీతో పాటు ఇతర భాషలకు చెందిన 300 సినిమాల్ని డబ్ చేసి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కన్నడ సినీ వర్గాలు వెల్లడించాయి.భారతీయ సినీ పరిశ్రమలతో పోలిస్తే పరిమిత మార్కెట్... పరభాషా చలనచిత్రాల నుంచి ఎదురయ్యే పోటీ... వీటన్నింటి నడుమ మనుగడ సాగిస్తున్న 77 ఏళ్ల చందనసీమను ప్రస్తుతం డబ్బింగ్ చిత్రాల భీతి తొలుస్తోంది. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తుది నివేదిక డబ్బింగ్కు అనుకూలంగా ఉండనుందనే ప్రచారం వూపందుకుంది. ఈక్రమంలో కొందరు డబ్బింగ్ను వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు.
ఇప్పటికే డబ్బింగ్ను వ్యతిరేకిస్తూ కన్నడ చళవళి వాటాళ్ పక్షం ఈనెల 27న సినీపరిశ్రమ బంద్కు పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. నూతన సినిమా విధానం ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉందని చిత్రపరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 22న కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి పదాధికారులతో సమాచారశాఖ మంత్రి రోషన్బేగ్ సమావేశం కానున్నారు.
ఇప్పటికే మై హస్బెండ్స్ వైఫ్ హిందీ చిత్రం 'నన్న గండన హెండ్తి' పేరుతో విడుదల చేస్తున్నట్లు పోస్టర్లు కూడా వెలిశాయి. నేరుగా కన్నడలో సినిమా తీయాలంటే కనీసం రూ. రెండు- రూ. మూడు కోట్లను వ్యయం చేయాలి. పెద్ద హీరో అయితే ఇది మరింత పెరుగుతుంది. అంత వ్యయం చేసినా ప్రేక్షకులు ఆదరిస్తే ఫరవాలేదు. నిరాదరణకు గురైందంటే నష్టాల వూబిలోకి పడటం ఖాయం. అదే డబ్బింగ్ చేస్తే కేవలం రూ. 35 లక్షలు- రూ.50 లక్షల్లోపే ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాల హక్కుల్ని పొందవచ్చు. మరో రూ.లక్ష వ్యయం చేస్తే డబ్బింగ్ పూర్తి చేయవచ్చన్నది కొందరు నిర్మాతల ఆలోచన.
పరభాషా సినిమాలతో ఎదురయ్యే పోటీని నిలువరించి కన్నడ చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1960లో ఇతర భాషల సినిమాలను కన్నడలోకి డబ్ చేయడాన్ని నిషేధించారు. చిత్ర పరిశ్రమ తనకుతానుగా ఈ నిర్భందాన్ని విధించుకుంది. అంతేకాదు పరభాషా చిత్రాలు కర్ణాటకలో 21 ప్రింట్లకు మించి విడుదల చేయరాదనే ఆంక్షలను విధించారు. అప్పట్లో జరిగిన పోరాటానికి కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్కుమార్ నేతృత్వం వహించారు. అప్పటి నుంచి డబ్బింగ్కు అవకాశం లేదు. ఆ దిశగా ఎవ్వరూ కనీసం ఆలోచించడానికీ జంకేవారు. చిత్రపరిశ్రమ అంతా ఒక్కతాటిపై ఉంటూ వచ్చింది.
రాజ్కుమార్ మరణానంతరం డబ్బింగ్ అంశం తెరమీదకు వచ్చినప్పటికీ విష్ణువర్ధన్, అంబరీష్ తదితర హీరోలు, ఇతర ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించడంతో తెరపడింది. రాజ్కుమార్ తరువాత అంతటి కథానాయకుడు విష్ణువర్ధన్ మరణం, అంబరీష్ రాజకీయాల్లో తీరికలేకుండా ఉంటూ చిత్రపరిశ్రమకు దూరం కావడం అదే సమయంలో కాంపిటిషన్ కమిషన్ నివేదిక రావడం.. ఈ అంశాలూ డబ్బింగ్ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చాయి. కన్నడ నిర్మాతల సంఘంలో మెజారిటీ సభ్యులు డబ్బింగ్కు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోలు ఈ విషయమై స్పందించలేదు.
ఒకప్పుడు ఏడాదికి 40-50 కన్నడ సినిమాలు మాత్రమే విడుదలయ్యేవి. ఇప్పుడవి 140-150కి చేరుకున్నాయి. వీటిలో ఎన్ని విజయం సాధిస్తున్నాయనే అంశాన్ని పక్కకు పెడితే అనేకమంది కొత్త నిర్మాతలు ఏడాదికేడాది పుట్టుకొస్తున్నారు. అనేక ప్రయోగాత్మక చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అప్పట్లో అన్నింటికీ చెన్నైని ఆశ్రయించాల్సి వచ్చేది. క్రమేపీ బెంగళూరులో చిత్ర నిర్మాణానంతర కార్యకలాపాలకు సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు సమకూరాయి.
కన్నడ సినిమాల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వినోద పన్ను రాయితీని కల్పించడంతో పాటు అశ్లీలత, కూరత్వం లేని వంద సినిమాలకు రూ. పది లక్షల వంతున ఆర్థికసాయాన్నీ అందచేస్తోంది. ఇలాంటి దశలో డబ్బింగ్ భూతం కన్నడ చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తీవ్ర విఘాతం కల్గిస్తుందనేది సినీఅభిమానుల వాదన.. ఆవేదన.