నిర్మాతలతో సహకరించని నటిపై కేసు నమోదు చేసిన ప్రొడ్యూసర్
దాదాపు ఐదేళ్లపాటు తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ఇలియానుకు ఇప్పుడు సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. అసలే వరుస ఫ్లాపులతో ఒక్కోమెట్టు దిగిపోతున్న ఈ అమ్మడు టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు చేరుకుంది. సలీమ్, రెచ్చిపో, శక్తి, నేను నా రాక్షసి చిత్రాలు ఇలియానాకు పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. ఈ ఫ్లాపులతో తలపట్టుకు కూర్చున్న ఇలియానాకు మరో పెద్ద చిక్కే ఎదురైంది. తనకిచ్చిన డేట్లు వేరొకరికి కేటాయించినందుకు ఓ తమిళ ప్రొడ్యూసర్ ఇలియానాపై తమిళ నిర్మాతల సంఘంలో కేసు నమోదు చేశారు.
నటరాజ్ అనే తమిళ నిర్మాత, స్టార్ హీరో విక్రమ్తో చేస్తున్న "దీవా తిరుముగన్" అనే చిత్రంలో నటించేందుకు గానూ ఇలియాన్ రూ. 35 లక్షలు అడ్వాన్సు తీసుకొని తనకు కేటాయించిన డేట్లను వేరొకరికి కేటాయించిందని నటరాజ్ ఆరోపింటారు. బాలీవుడ్లో సూపర్హిట్ అయిన 3-ఇడియట్స్ చిత్రానికి తమిళ రీమేక్ "నన్బన్"కు అవే డేట్లను ఇలియానా ఇవ్వడంతో ఆమెపై నటరాజ్ కేసు నమోదు చేశాడు. ప్రస్తుతం విక్రమ్ సరసన ఇలియానా నటించడం లేదు.
సినిమా ఎగ్గొట్టడమే కాకుండా తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని నటరాజ్ పేర్కొన్నారు. దీంతో నటరాజ్ సినిమాకు విక్రమ్ సరసన ఇలియానాకు బదులు అనుష్కను తీసుకున్నారు. తన డబ్బులు తిరిగి ఇచ్చే వరకూ తమిళంలో ఇలియానాపై నిషేధం విధించాలని నటరాజ్ డిమాండ్ చేస్తున్నాడు. ఇటీవల శక్తి సినిమా ప్రమోషన్లో సహకరించడం లేదని ఆ సినిమా నిర్మాక అశ్వనీ దత్ కూడా ఇలియానాపై మండిపడ్డ సంగతి తెలిసిందే. పాపం ఇలియానా..! ప్రొడ్యూసర్లతోనే గొడవలు పెట్టుకుంటే పోతే కేరీర్ ఏమౌతుందోనని ఆలోచించుకోలేదోమో..!


Click it and Unblock the Notifications











