షాకయ్యానంటూ...ఎన్టీఆర్ రభసపై కొరటాల శివ ట్వీట్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజా సినిమా 'రభస' గురించి ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తలపై 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ విస్మయం వ్యక్తం చేసారు. ఆ వార్తలు విని షాకయ్యాను అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తాను రభస చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తల్లో నిజం లేదని తెలిపారు.
'రభస' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అనారోగ్యం పాలు కావడంతో మిగిలిన భాగానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. దీంతో కొరటాల శివ ట్విట్టర్లో స్పందిస్తూ 'దర్శకుడికి అనారోగ్యం కారణంగా ఎన్టీఆర్ రభస చిత్రానికి నేను దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు విని షాకయ్యాను, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు' అంటూ ట్వీట్ చేసారు.
ఈ మధ్య జూ ఎన్టీఆర్, కొరటాల శివ క్లోజ్గా మూవ్ అవుతుండటంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల జూ ఎన్టీఆర్ తాతయ్యకు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్కు రావడం తెలిసిందే. ఆయనతో పాటు కొరటాల శివ కూడా రావడం చర్చనీయాంశం అయింది.
జూ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న రభస(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు దశలో ఉంది. సమంత, ప్రణీత హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












