వందల కోట్ల నష్టం: సురేష్ బాబు, అండగా ఉంటాం: కేటీఆర్
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ పైరసీ వల్ల ఎంత నష్టపోతుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. సినిమా ఇలా రిలీజ్ కావడం, అదే రోజు సాయంత్రమే ఇంటర్నెట్లో పైరసీ ప్రత్యక్షం కావడం, సీడీల రూపంలో మార్కెట్లోకి రావడం పరిపాటి అయిపోయింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న బాహుబలికి లాంటి పెద్ద సినిమాలకు సైతం పైరసీ బెడద తప్పలేదు.
ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరశ్రమకు అండగా ఉండేందుకు, పైరసీనుంచి కాపాడేందుకు తెలంగాణ ఐటీ శాఖ నడుం బిగించింది. సినిమా పరిశ్రమవర్గాలతోపాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ అధికా రులతో బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ తరుపు డి సురేష్ బాబు మాట్లాడుతూ ఈ ఏడాది గడిచిన తొమ్మిది నెలల్లో తెలుగు సినీ పరిశ్రమ రూ. 350 కోట్లు నష్టపోయిందని తెలిపారు. దేశంలోనే రెండోస్థానంలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో పైరసీ వల్ల వందల కోట్ల నష్టం జరుగుతున్నదని సినీ పరిశ్రమ ప్రతినిధులు మంత్రికి వివరించారు. యూరప్ దేశాల్లో అమలుచేస్తున్న యాంటీ పైరసీ విధానాలను ఉదహరించారు. పైరసీకి పాల్పడుతున్న సుమారు 100 వెబ్సైట్లను నిలిపివేయాలని వారు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. పైరసీ నుంచి కాపాడాలని ప్రతి సినిమా విషయంలో కోర్టుకు వెళ్లడం సాధ్యంకాదని చెప్పారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ పైరసీకి ప్రభుత్వం వ్యతిరేకమని తెలిపారు. పైరసీని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని చెప్పారు. పైరసీవల్ల వ్యాపారపరమైన నష్టమేకాకుండా, దీనిపై ఆధారపడిన అనేక మంది ఉపాధికి నష్టం వాటిల్లనున్న దృష్ట్యా ఆ జాడ్యాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
సినిమాల పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లను నిలిపివేయాలన్న సూచనకు సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని పరిశ్రమ ప్రతినిధులు, సర్వీస్ ప్రొవైడర్లు కోరారు. పైరసీ సమస్య కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదని, మొత్తం సినీపరిశ్రమ ఈ సమస్యను ఎదుర్కొంటున్నదని మంత్రి అన్నారు.


Click it and Unblock the Notifications











