శ్రీమంతుడు: కేటీఆర్ కామెంట్స్, మహేష్ బాబు రీట్వీట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్ శ్రీమంతుడు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆ సినిమాలో ఓ గ్రామాన్ని దత్తతకు తీసుకొని దాని బాగోగులు చూసుకోవడం లాంటి కథాంశం స్ఫూర్తినిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా గ్రామ జ్యోతి పథకం ప్రారంభించిన సమయంలో, శ్రీమంతుడు సినిమా కథ కూడా గ్రామం అభివృద్ధి చుట్టూ తిరగడం స్ఫూర్తినిచ్చే అంశమని ట్వీట్ చేశారు. కేటీఆర్ ప్రశంసలకు ధన్యవాదాలు తెలుపుతూ హీరో మహేష్ బాబు రీట్వీట్ చేయడం గమనార్హం.
శ్రీమంతుడు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు అదరగొడుతోంది. వీకెండ్ తో పాటు వీక్ డేస్ సోమ, మంగళ వారాల్లో కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. తొలి ఐదు రోజుల్లో ‘శ్రీమంతుడు' చిత్రం వరల్డ్ వైడ్ రూ. 51 కోట్ల షేర్ సాధించడం విశేషం. దీంతో మహేష్ బాబు కెరీర్లో రూ. 50 కోట్లు వసూలు చేసిన చిత్రాల సంఖ్య మూడుకు చేరుకుంది.

ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూ. 51 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘దూకుడు' చిత్రం రూ. 57 కోట్లు వసూలు చేసింది. తాజాగా శ్రీమంతుడు కూడా రూ. 50 కోట్ల క్లబ్ లో చేరడం గమనార్హం. ఈ వీకెండ్ ఆగస్టు 15 కూడా ఉండటంతో సినిమాకు కలెక్షన్లు బాగా కలిసొస్తాయని భావిస్తున్నారు.
శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సొంత ఊరుకు మంచి చేయాలనే కాన్సెప్టుతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.


Click it and Unblock the Notifications











