నా కూతుర్నికూడా హీరోయిన్ను చేస్తాను...
హైదరాబాద్: మంచు లక్ష్మి-అడవి శేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దొంగాట' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మంచు లక్ష్మి చిట్టి కూతురు విద్యా నిర్వాణ సమర్ఫణలో విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.
ఈ సినిమా గురించి మంచు లక్ష్మి వివరిస్తూ...నా కెరీర్లో మొదటిసారి నటించిన వినోదప్రధాన చిత్రం దొంగాట. ఇందులో నేను సినిమా హీరోయిన్ పాత్రలో కనిపిస్తాను. అనూహ్య పరిస్థితుల్లో నన్ను కొందరు కిడ్నాప్ చేస్తారు. అసలు ఆ కిడ్నాప్ వెనకున్న సూత్రధారులెవ్వరు? ఏం ఆశించి వారు నన్ను కిడ్నాప్ చేశారు? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. కెరీర్లో తొలిసారి వినోదప్రధాన పాత్ర చేయడం వల్ల కొంచెం టెన్షన్గా ఫీలయ్యానని తెలిపారు.

ఎలాంటి సినిమాలు తీసినా అందులో ఏదో ఒక సందేశం వుండాలన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. దొంగాట చిత్రంలో మనిషికి, డబ్బుకు మధ్యనున్న సంబంధాన్ని తాత్విక కోణంలో తెలియజెప్పే ప్రయత్నం చేశాం. అనుకున్న బడ్జెట్లో ఈ సినిమా తీయడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.
పాప నా జీవితంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రపంచాన్ని చూస్తోన్న అనుభూతి కలుగుతోంది. తన ప్రేమలో నేను ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. వీలైనంత సమయాన్ని పాపతో గడపడానికి కేటాయిస్తున్నాను. పెద్దయ్యాక నా కూతురిని కూడా సినీరంగంలోకి తీసుకొస్తాను. తనను హీరోయిన్ చేయాలనేది నా కోరిక అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











