విశ్వరూపం బ్యాన్ ఎత్తేయండి: కేంద్రం
న్యూఢిల్లీ/చెన్నై: విశ్వరూపం చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం 15 రోజుల బ్యాన్ విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తమిళనాడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలని, సినిమా విధించిన బ్యాన్ ఎత్తి వేయాలని సూచించింది. ఇలాంటి విషయాలు సుప్రీం కోర్టు, సెన్సార్ బోర్డు పరిధిలో ఉంటాయని, ప్రభుత్వాలు కలుగ జేసుకోవడం సరికాదని సూచించింది.
కాగా... తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తున్న విశ్వరూపం చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు కమల్ హాసన్ మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయంపై స్టే విధించి సినిమా విడుదలయ్యేలా చూడాలని ఆయన కోర్టును కోరారు. అయితే కమల్ కు కోర్టులో చుక్కెదురైంది. ఈ నెల 28 వరకు బ్యాన్ కొనసాగిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నెల 26వ తేదీన న్యాయమూర్తి చూడనున్నారు. తన ఆదేశాలు తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు.
కాగా తమిళనాడు మినహా ఈచిత్రం ఇతర ప్రాంతాల్లో విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే హిందీ, తెలుగు వెర్షన్లలో సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు చేసారు. కొన్ని చోట్ల సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది. తమిళనాడులో మాత్రం కోర్టు 28న తర్వాత కోర్టు నిర్ణయం ఆధారంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











