కెరీర్ నాశనమైంది: చిరు 150లో నటిస్తానన్న దర్శకుడి మాజీ భార్య
హైదరాబాద్: సౌతిండియాతో పాటు బాలీవుడ్లోనూ పలు విజయవంతమైన సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఆయన భార్య లిజి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పలు కారణాలతో 24 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెగదెంపులు చేసుకున్నారు. 1991లో ప్రేమ వివాహం చేసుకున్న లిజి, ప్రియదర్శన్కు కల్యాణి, సిద్ధార్థ్ అనే పిల్లలున్నారు, వారిద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. పెళ్లికి ముందు వరకు పలు చిత్రాల్లో లిజీ హీరోయిన్ గా నటించింది. తెలుగులో మామాశ్రీ, సాక్షి, మగాడు, 20వ శతాబ్దం, ఆత్మబంధం, శివశక్తి తదితర చిత్రాల్లో నటించారు.
ప్రియదర్శన్ను పెళ్లి చేసుకున్న తర్వాత పాతికేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న లిజీ విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయమై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగులో సుమన్కి జోడీగా నటించిన ‘ఆత్మబంధం' సమయంలో నాకు పెళ్లయ్యింది. సినిమాల్లో నటించకూడదని ఆయన(ప్రియదర్శన్) కండీషన్ పెట్టడంతో పీక్ స్టేజ్లో ఉండగానే సినిమాలకు దూరమైపోయాను. అవకాశాలు బాగున్నప్పుడు పెళ్లి చేసుకుని కెరీర్ను నాశనం చేసుకున్నాను అనిపిస్తుంది అన్నారు.

ఇప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. పిల్లలు కూడా నటించమని ప్రోత్సహిస్తున్నారు. హీరోయిన్గా ఇప్పుడెలాగూ చేయలేము. ఆ స్థాయి క్యారెక్టర్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. ‘అత్తారింటికి దారేది'లో నదియా చేసినటువంటి పాత్రలు చేయాలనుంది. అమ్మ పాత్రల్లో నటించేందుకు సిద్ధం. ‘శ్రీమంతుడు'లో జగపతిబాబు భార్యగా ఆఫర్ వచ్చింది. కానీ, ఆ సమయంలో నటించలేకపోయాను. తమిళంలో రామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాను. అందులో 60 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడే 40 ఏళ్ల మహిళ పాత్ర నాది. చిరంజీవి 150వ సినిమాలో అవకాశం వస్తే తప్పక నటిస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











