టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ రచయిత మృతి
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 2న ప్రముఖ దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఇండస్ట్రీలో మరో ఘటన చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ప్రముఖ సినీ గేయ రచయిత శివగణేశ్ కన్నుమూశారు. వనస్థలిపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది.
శివగణేష్ ఎన్నో చిత్రాలకు పాటలు రాశారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం సహా పలు భాషల్లో దాదాపు వెయ్యికి పైగా పాటలు రాశారు. తమిళ డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయాలంటే ముందు ఆయన పేరే వినిపించేది. ఈ క్రమంలోనే 'ప్రేమికుల రోజు', 'నరసింహా', 'జీన్స్', 'ఒకే ఒక్కడు', 'బాయ్స్', 'ఎంతవారు కాని', '7జీ బృందావన్' చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి.

పాటల రచయితగానే కాకుండా శివగణేశ్ మాటలు కూడా రాసేవారు. ఆయన ఎక్కువ డబ్బింగ్ చిత్రాలకు సంభాషణలు అందించారు. ముఖ్యంగా 'ఒకే ఒక్కడు'లో ఆయన రాసిన డైలాగులకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రం తర్వాత మరికొన్నింటికి ఆయన పని చేశారు. కొద్దిరోజులుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటుతో మరణించారు. శివగణేశ్కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్, మానస్లు ఉన్నారు. ఆయన మృతికి తెలుగు సినీ పరిశ్రమతో పాటు తమిళ సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


Click it and Unblock the Notifications











