మా ఎన్నికలపై వీడని ఉత్కంఠ: వీడియో సీడీలపై ఆదేశం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల కేసు విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్ 7వ తేదీలోగా పోలింగ్ వీడియో సీడీలు సమర్పించాలని సిటీ సివిల్ కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది. మార్చి 29వ తేదీ మా ఎన్నికల పోలింగ్ జరిగింది.
మా ఎన్నికలపై కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఎన్నికల వీడియో సీడీలు కోర్టుకు చేరాల్సి ఉంది. అయితే, ఇంకా చేరలేదు. దీంతో మా ఎన్నికల ఫలితాలపై చోటు చేసుకున్న ఉత్కంఠ వీడలేదు.
'మా' ఎన్నిక: వచ్చిన హీరోలు,ఆర్టిస్టులు (ఫొటోలు)

మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన జయసుధ, రాజేంద్ర ప్రసాద్ విజయంపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఆదివారంనాడు ఈ నెల 29వ తేదీన ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘంలోని మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఒకరిద్దరు మినహా స్టార్ హీరోలెవ్వరూ ‘మా' ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదు.
సినీ నటులు బాలకృష్ణ, మురళీమోహన్, నాగబాబు, ప్రకాష్రాజ్, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, కృష్ణంరాజు, బ్రహ్మానందం, రావు రమేశ్, అజయ్, గిరిబాబు, రవిబాబు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా' అధ్యక్ష ఎన్నికపై సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











