మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్ నామినేషన్: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఊహించని విధంగా క్లారిటీ
ప్రతి రెండేళ్లకు ఒకసారి తెలుగు సినీ ఇండస్ట్రీలో 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'కు ఎన్నికలు జరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఈ ఎన్నికలు జరిగినా దీని గురించి పరిశ్రమలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అయితే, ఈ సారి అది ఇంకాస్త ముందుగానే ప్రారంభం అయింది. ప్రస్తుత పాలక వర్గం పని చేస్తూనే ఉన్నా.. అక్టోబర్లో జరగాల్సిన ఎన్నికల కోసం చాలా రోజుల నుంచే హడావిడి కనిపిస్తోంది. ఇందులో విజయం సాధించేందుకు అప్పుడే పలువురు సినీ ప్రముఖులు పావులు కదుపుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రకాశ్ రాజ్ ముందడుగు వేయడంతో పాటు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆ వివరాలు మీకోసం!

ఐదు నుంచి మూడుకు చేరడంతో
'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో ఇద్దరు ముగ్గురు ప్రముఖులు అధ్యక్ష పదవికి పోటీ పడుతూ వస్తున్నారు. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు నటీనటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, వీరి నుంచి జీవిత, హేమ తప్పుకోవడంతో పాటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చేరిపోయారు.

ప్రకాశ్ రాజ్ అన్నీ ప్లాన్ ప్రకారమే
'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల కోసం ప్రకాశ్ రాజ్ ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకే అందరి కంటే ముందే తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇప్పటికే 27 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ను కూడా ప్రకటించారు. అంతేకాదు, వెంటనే వాళ్లందరితో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

ఎన్నికల తేదీ ప్రకటించిన ‘మా’
సినీ పరిశ్రమలో జరగాల్సిన 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల కోసం చాలా సమయం ఉన్నా చాలా మంది ప్రముఖులు పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో నోటిఫికేషన్ రాకముందే పనుల్లో బిజీ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అక్టోబర్ 10న మా ఎలెక్షన్ జరుగుతుందని ప్రకటించారు. అదే రోజు కౌటింగ్ కూడా జరుగుతుందని పేర్కొన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన టీమ్
'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా తన నామినేషన్ను దాఖలు చేశారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారి కృష్ణమోహన్కు నామినేషన్ పత్రాలను అందించారు. ఈనెల 29వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న పరిశీలిస్తారు. 1,2 తేదీలలో వీటిని ఉపసంహరించుకోవచ్చు.

ఎవరు గెలుస్తారో వాళ్ల చేతులోనే
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 'ఇప్పుడే నాతో పాటు నా ప్యానెల్ సభ్యులంతా కలిసి నామినేషన్ దాఖలు చేశాం. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనేది మేము డిసైడ్ చేయలేము. మా సభ్యులే తమ తమ ఓట్ల ద్వారా గెలుపు ఓటములను నిర్ణయిస్తారు' అంటూ ఆయన పేర్కొన్నారు.
Recommended Video

పవన్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు
'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ 'పవన్ కల్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఆవేశంతో పాటు అర్థం కూడా ఉంది' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











