MAA Electionsలో ట్విస్టు.. ఎన్నికల బరిలోకి జయసుధ.. ప్రెసిడెంట్గా పోటి? వేగంగా మారుతున్న పొలిటికల్ కలర్స్
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (MAA) ఎన్నికల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల బరిలోకి ఊహించని పేర్లు తెరపైకి రావడంతో సర్వత్రా ఆసక్తిని పెంచుతున్నది. ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే అనేక వివాదాలు, సంచలన ప్రకటనలు, గాసిప్స్ విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో మా ఎన్నికలకు సంబంధించిన తాజా విషయాల్లోకి వెళితే...

ప్రకాశ్ రాజ్ వేగంగా స్పందించి..
MAA కార్యవర్గం ఏర్పాటుకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విషయం వెల్లడి కాగానే.. ఆశావహులు ముందే అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంలో ప్రకాశ్ రాజ్ చాలా వేగంగా స్పందించి మెగాస్టార్ చిరంజీవిని కలుసుకొని మద్దతు కోరారు. వారిద్దరి భేటికి, ప్రకాశ్ రాజ్కు అభ్యర్థిత్వానికి నాగబాబు సానుకూలంగా స్పందించారు.

మా ఎన్నికల్లో చతుర్మఖ పోటీ
ఇలాంటి నేపథ్యంలో మంచు విష్ణు, నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్, నటి హేమ అధ్యక్ష పదవి పోటీకి సిద్ధమయ్యారు. దాంతో ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ తప్పదనే విషయంపై స్పష్టత వచ్చినట్టు కనిపించింది. అయితే ఈ వ్యవహారంలో కీలక ట్విస్టు ఇస్తూ జయసుధ కూడా బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే జయసుధ ఇంకా ఎలాంటి స్పందనను వ్యక్తం చేయకపోవడంతో మరింత ఆసక్తి పెరిగింది.

ఎన్నికల బరిలోకి జయసుధ
గతంలో MAA ఎన్నికల్లో జయసుధ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అందరూ రాజేంద్ర ప్రసాద్కు మద్దతు తెలపడంతో ఆమె ఓటమి పాలవ్వడం జరిగింది. అయితే ఈ సారి ఆమెను బరిలో నిలబెట్టి గౌరవం దక్కేలా చూడాలని ఓ వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వివాదాలకు దూరంగా ఉండే నటీమణి జయసుధ కావడంతో ఆమెకు మద్దతు కూడకట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

జయసుధ విముఖంగా ఉన్నట్టు
అత్యంత రాజకీయాల మధ్య జరగడానికి అవకాశం ఉన్న MAA ఎన్నికల్లో పోటీ చేయడానికి జయసుధ విముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఆమెను బరిలోకి దించేందుకు కొందరు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఒకవేళ పోటీ చేయకపోతే జయసుధ మంచు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారనే వాదన ప్రచారంలో ఉంది. అయితే ఇలాంటి వార్తలపై జయసుధ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

రాజకీయ ఎత్తుగడలతో మరింత ఆసక్తిగా
అయితే MAA ఎన్నికలు ప్రత్యక్ష రాజకీయాలను తలపించే విధంగా జరగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రత్యర్థుల గెలుపును ఎలా అడ్డుకోవాలి? ప్రత్యర్థుల ఓట్లు ఎలా చీల్చాలి? అభ్యర్థుల గెలుపును ఎలా అడ్డుకోవాలి? అనే కోణంలో పలు వర్గాలు వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శివాజీ రాజా కార్యదర్శిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారనే వార్త మరింత జోష్ను పెంచింది. ఏది ఏమైనా.. మా ఎన్నికల్లో ఎవరు చివరకు నిలబడుతారనే విషయంపై వారం రోజుల్లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











