‘మా’ ఎలక్షన్స్: జయసుధకు మోహన్ బాబు మద్దతు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక విషయంలో రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయి. ‘మా ' అధ్యక్ష పదవికోసం రాజేంద్రప్రసాద్-జయసుధ పోటీ పడుతున్న నేపథ్యంలో......పరిస్థితులు జయసుధకు అనుకూలంగా మారుతున్నాయి. ప్రముఖులంతా జయసుధ వైపే మళ్లారు. తాజాగా మోహన్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా జయసుధకు తన మద్దతు ప్రకటించారు. కృష్ణం రాజు లాంటి సీనియర్లు కూడా జయసుధ వైపే ఉన్నారు.
మరో వైపు రాజేంద్రప్రసాద్ ప్యానెల్కు బుధవారం భారీ షాక్ తగిలింది. ఈ ప్యానెల్ నుండి శివాజీ రాజా, ఉత్తేజ్ తప్పుకున్నారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ తరుపున శివాజీ రాజా ‘మా' ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఉన్నట్టుండి తప్పుకున్నారు. అయితే వీరు ఎందుకు పోటీ నుండి తప్పుకున్నారనే విషయం తేలలేదు. ఈ విషయమై స్పందించేందుకు రాజేంద్రప్రసాద్ నిరాకరించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ నుండి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఓ. కళ్యాణ్, ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, కోశాధికారిగా చక్రపాణి, సంయుక్త కార్యదర్శులుగా భూపాల్, ఉత్తేజ్ పోటీ పడుతున్నారు. ఈ ప్యానెల్ నుండి శివాజీ రాజా, ఉత్తేజ్ తప్పుకోవడం చర్చనీయాశం అయింది.

మరో వైపు జయసుధ ప్యానెల్ ప్రముఖులతో బలంగా కనిపిస్తోంది. ఈ ప్యానెల్ తరుపున తనికెళ్ల భరణి(కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు), అలీ (కార్యదర్శి), పరుచూరి వెంకటేశ్వరావు(కోశాధికారి), నరేష్, రఘు బాబు(సంయుక్త కార్యదర్శులు), చార్మి, ఢిల్లీ రాజేశ్వరి, గీతాంజలి, హేమ, జయలక్ష్మి, నిర్మల, శివ పార్వతి, బెనర్జీ, బ్రహ్మాజీ, హరినాథ్ బాబు, జాకీ, కృష్ణుడు, మహర్షి రాఘవ, నర్సింగ్ యాదవ్, రాజీవ్ కనకాల, శ్రీశశాంక, శ్రీనివాస్ పసునూరి, విద్యాసాగర్(కార్యవర్గ సభ్యులు)గా పోటీలో ఉన్నారు. ఇప్పటికే జయసుధ ప్యానల్ నుండి ఉపాధ్యక్షులుగా శివకృష్ణ, మంచు లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


Click it and Unblock the Notifications











