జయసుధకు మద్దతు అనేది కాదు, మేమంతా ఒక్కటే: మురళీ మోహన్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ స్పందించారు. తాను జయసుధకు మద్దతు ఇచ్చాననేది కాదని, తామంతా ఒక్కటేనని ఆయన అన్నారు. మా ఎన్నికల విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట నిజమేనని, కోర్టు దాకా వెళ్లారని ఆయన అన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగిందని ఆయన అన్నారు. పోటీ అనేది ఎన్నికల వరకేనని, ఎన్నికలు పూర్తయిన తర్వాత తామంతా ఒక్కటేనని ఆయన అన్నారు. విజయాన్ని సాధించిన రాజేంద్ర ప్రసాద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వెనకబడిన కళాకారులకు మా అండగా నిలబడాలని ఆయన అన్నారు.

తాను పోటీ చేస్తే గెలిచి ఉండేవాడిననే విషయంలో కొంత నిజం ఉందని, అయితే ఎప్పుడూ తానే ఉండడం సరి కాదని యువతను తీసుకుని వద్దామని చూశామని, అయితే యువత ముందుకు రాలేదని ఆయన అన్నారు.
ఎన్నికలకు సహకరించిన అందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. సభ్యులు ఇచ్చిన నిర్ణయాన్ని అందరం గౌరవించాల్సిందేనని ఆయన అన్నారు. రెండు నెలలు ఎన్నికలు ఉత్కంఠను కలిగించాయని ఆయన అన్నారు. తాము మాలో అనవసరమైన ఖర్చులు ఏమీ చేయలేదని, అందుకే ఆ మాత్రం మూలధనం ఉందని ఆయన చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోయిందని మీడియా అంటోందని, తామంతా ఒక్కటిగానే ఉన్నామని, తామంతా ఒక్కటేనని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











