తెలుగు సినిమాలు దేశానికే మార్గదర్శనం.. అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు ప్రభాస్ అంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
బాహుబలి విడుదల తర్వాత సౌత్ సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆ తరువాత నుంచి సౌత్ హవా నార్త్ లో కొనసాగుతోంది. తగ్గేదేలే అంటూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి వరుస పాన్ ఇండియా చిత్రాలు విడుదలై హిందీలో కూడా బంపర్ హిట్లు కొడుతున్నాయి. ఇటీవల పుష్ప వేవ్ తర్వాత ఆర్ఆర్ఆర్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు సౌత్ మీద అందరి ద్రుస్తో పడుతోంది. తాజాగా తెలుగు సినిమాల గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

తెలుగు సంగమం
మధ్యప్రదేశ్ అభివృద్ధిలో తెలుగు ప్రజలు గణనీయమైన కృషి చేశారని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ, తెలుగు వారికి మంచి గౌరవం ఉందని, తమ రాష్ట్ర వాసులతో బాగా కలిసిపోయారని అన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన 'తెలుగు సంగమం' కార్యక్రమంలో చౌహాన్ ఈ మేరకు కామెంట్లు చేశారు.

విభిన్న సంస్కృతులను కలిగి ఉన్నప్పటికీ
తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని, వారసత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో తెలుగు సంగమం, భోపాల్లోని బాలాజీ భజన మండలి మరియు తెలుగు సాంస్కృతిక పరిషత్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ "మనం విభిన్న సంస్కృతులను కలిగి ఉన్నప్పటికీ, మన ఆత్మ ఒక్కటే మరియు మనమందరం ఒక గొప్ప దేశమైన భారతదేశానికి చెందినవారము" అని ఆయన అన్నారు.

సన్మానించారు
తెలుగు ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే కాకుండా తెలుగు భాషా కళల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులను సత్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నటుడు అలీ, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎల్వి గంగాధర్ శాస్త్రి, గిరిజన జానపద గాయకుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యలను ఆయన సన్మానించారు.

బాహుబలి లాంటి సినిమాలను
ఇక ఆయన మాట్లాడుతూ భారతీయ సినిమాలో తెలుగు సినిమా అంటే టాలీవుడ్ కి ప్రత్యేక స్థానం ఉంది. బాహుబలి సినిమా చూసి మేమంతా ఫిదా అయ్యాం. తెలుగు సినిమా నిర్మాతలు దేశంలోని ప్రజలందరికీ సుపరిచితులే'' అని చౌహాన్ అన్నారు. అంతేకాక శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్ కంటే పెద్దదిగా మారిందని అందుకే బాహుబలి లాంటి సినిమాలను దేశానికి ఇస్తోందని అన్నారు.

పాన్ ఇండియా సినిమాలు
ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తెలుగు వారిని ప్రపంచం గుర్తించేలా చేస్తే ఇప్పుడు ప్రభాస్ తెలుగువారిని ప్రపంచం గుర్తించే విధంగా చేస్తున్నారని అన్నారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమ దేశ సినిమా భవిష్యత్తుకి కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తోంది అని ఆయన అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు సినిమా గురించి ఇలా మాట్లాడటం అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందని ముఖ్యమంత్రి మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలుగు నుంచి అనేక పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తెలుగు సినిమా, హిందీ సినిమా అని కాకుండా ఇది ఇండియన్ సినిమా అనుకునే రోజులు రాబోతున్నాయి అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











