మహేష్ బాబు, శృతి హాసన్ ఐటం సాంగ్ డీటేల్స్
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రంలో శృతి హాసన్ ఐటం సాంగు చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఐటం షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇతర వివరాల్లోకి వెళితే....'ఆగడు' చిత్రం విడుదల తేదీ తొలుత సెప్టెంబర్ 26 అనుకున్నప్పటికీ ఇంకా ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. 'దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి.

మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల 'ఆగడు' టీజర్ని విడుదల చేశారు. ఇందులో మహేష్ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్లపై ఓ పంచ్ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్ మొత్తం హుషారుగా సాగిపోయింది. సినిమాపై అంచనాలు పెంచింది.


Click it and Unblock the Notifications











