దటీజ్ మహేష్ ...ఒక్క ట్వీటేసి అదరకొట్టాడు
హైదరాబాద్: మహేష్ ట్వీట్ కు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు అంటున్నారు ఫ్యాన్స్. ఆయన తన బావ గల్లా జయదేవ్ ని ఒక్క ట్వీటేసి గెలిపించాడని ప్రచారం చేస్తున్నారు. అందరూ సుడిగాలి ప్రచారాలతో ఎలక్షన్స్ లో హోరెత్తిస్తే...మహేష్ బాబు మాత్రం కేవలం తన బావకు అనుకూలంగా ట్వీట్ చేసాడని అంటున్నారు. అది మహేష్ బాబు అభిమానులనే కాక గుంటూరులోని సామాన్యులను సైతం రీచ్ అయ్యిందని, ప్రచారాస్త్రంగా ఉపయోగపడిందని అంటున్నారు. తను ఆయనకే ఓటేయాలనుకుంటున్నానని, మీరు కూడా వేయండని అభిమానులను కోరారు.వాస్తవానికి ఆయనకి కానీ, ఆయన కుటుంబానికి కానీ గుంటూరు లో ఓటు హక్కేలేదు.
రాజకీయాలంటే పడదని ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన తన బావ కోసం ట్విట్టర్ ద్వారా ప్రచారంలోకి దిగి,గెలిపించారు. గుంటూరు లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్కు మహేష్బాబు మద్దతు ప్రకటించారు. తన ఓటు తన బావకే అని, మీరు కూడా వేయండంటూ తన ఫ్యాన్స్ తో అన్నాడు. దాంతో తెలుగుదేశంకు మహేష్ సపోర్టు ఇచ్చినట్లు అయ్యింది.

మహేష్ ఇచ్చిన ట్వీట్ లో ... ''నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను. మా బావ జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున ఆయన గురించి మాట్లాడుతున్నా. మా అక్క పద్మతో ఆయన వివాహం అయినపుడు నా వయసు 13. జయదేవ్ అప్పట్నుంచి నాతో ఎంతో చనువుగా, అభిమానంగా ఉండేవారు.
అమరరాజా గ్రూప్, అమరాన్ బ్రాండ్ ఈ స్థాయికి చేరుకోవడానికి జయదేవ్ కృషి, పట్టుదల, విలువలే కారణం. నాకు ఆయనపై నమ్మకం ఉంది. ఆయన మార్పు తీసుకురాగలరన్న నమ్మకం ఉంది. నా మద్దతు, నా ఓటు ఆయనకే. మీ మద్దతు, మీ ఓటు ఆయనకేనని ఆశిస్తున్నా'' అని మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'లో మహేశ్ రాశారు.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే... మహేష్బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీసు పాత్రతో మరోసారి ప్రతాపం చూపించబోతున్నారు మహేష్బాబు. ఈ చిత్రంలో మహేష్ తొలిసారిగా రాయలసీమ యాస మాట్లాడుతూ తుపాకీ ఎక్కుపెట్టబోతున్నారు. 'ఆగడు'లో ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











