ముస్లిం అమ్మాయిగా నిత్యామీనన్... (వీడియో)
హైదరాబాద్: శర్వానంద్, నిత్యామీనన్ జంటగా సీసీ మీడియా అండ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై వల్లభ నిర్మిస్తున్న చిత్రం 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లోని తాజ్డెక్కన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి శర్వానంద్, నిత్యమీనన్, నిర్మాత కె.ఎస్.రామారావు, వల్లభ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. నిత్యామీనన్ ఈ చిత్రంలో ముస్లిం అమ్మాయిగా కనిపించనుంది. ఆ ట్రైలర్ మీరూ చూడండి.
విధికి తలొగ్గి తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేకపోయిన ఓ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం చివరకు ఏ తీరాలకు చేరింది? ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే చిత్ర కథ.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ చిరంజీవి నటించిన రాక్షసుడు చిత్రంలోని మళ్లి మళ్లీ ఇది రాని రోజు గీతం ఎంతటి ప్రజాదరణ పొందినదో అందరికీ తెలిసిందే. ఆ పాటలోని పల్లవిని టైటిల్గా పెట్టుకోవడం ఆనందంగా వుంది. పరిణితి చెందిన ప్రేమకథా చిత్రమిది. హృదయాల్ని మెలిపెట్టే భావోద్వేగభరిత సన్నివేశాలుంటాయి. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు మనసును కదిలించేలా వుంటాయి. శర్వానంద్ ఈ చిత్రంలో క్రీడాకారుడిగా కనిపిస్తారు. నిత్యామీనన్ పాత్రలో రెండు భిన్న పార్శాలుంటాయి అన్నారు.

చిత్ర సమర్పకుడు మాట్లాడుతూ ‘‘మా సంస్థలో వస్తున్న మరో బ్యూటీఫుల్ యూత్ లవ్ స్టోరీ ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేమ గొప్పతనాన్ని తెలియజేసే సినిమా. శర్వానంద్, నిత్యామీనన్ లాంటి వెర్సటైల్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. పాండిచ్చేరిలోని అందమైన లొకేషన్లలో ‘ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై విరసిల్లే..' అనే పల్లవితో సాగే పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది. ఈ పాటను సాహితి రాశారు. స్వర్ణ మాస్టర్ నృత్య రీతుల్ని సమకూర్చారు. సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. గోపీసుందర్ మంచి సంగీతాన్నిచ్చారు. క్రాంతిమాధవ్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ -మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్ మా చిత్రానికి బాణీలు అందించడం ఆనందం. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అందమైన ప్రేమకథగా ప్రేక్షకులను అలరిస్తుంది అని తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: జ్ఞానశేఖర్.వి.యస్., మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











