మారుతి కొత్త చిత్రం 'లవర్స్'...డిటేల్స్
హైదరాబాద్ : మారుతి వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కొన్ని చిత్రాలకు దర్శకుడుగానూ, మరికొన్ని చిత్రాలకు సమర్పకుడుగా...మరిన్ని చిత్రాలకు నిర్మాతగా ఆయన ప్రస్తానం సాగుతోంది. తాజాగా మారుతి సమర్పణలో మరో చిత్రం మొదలైంది. ఆ చిత్రం టైటిల్ 'లవర్స్'. సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మారుతి సమర్పకుడు. హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. హరి ఇంతకు ముందు లక్కి అనే చిత్రాన్ని శ్రీకాంత్ హీరోగా డైరక్ట్ చేసారు.
పుస్తకాలు ఓ చేతిలో. ప్రేమ లేఖ మరొక చేతిలో. చదువుకొనే వయసులోనే మనసులు ఇచ్చి పుచ్చుకొన్న ఓ జంట కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు హరినాథ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంనాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బెల్లంకొండ సురేష్ క్లాప్నిచ్చారు. డి.రామానాయుడు, కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

మారుతి మాట్లాడుతూ ''అనుభూతులను పంచే ప్రేమకథ ఇది. తొమ్మిది నెలలు కష్టపడి ఈ కథని తయారు చేసుకొన్నాడు దర్శకుడు. నేను ఈ సినిమాకి కేవలం ఓ నిర్మాతని మాత్రమే. సుమంత్ అశ్విన్, నందిత జంట కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. 'ప్రేమకథా చిత్రమ్' తర్వాత నందితకి మళ్లీ అంతటి పేరు తీసుకొచ్చేలా ఉంటుందీ సినిమా. సంభాషణలు ఆకట్టుకొంటాయి''అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఇంటిల్లిపాదికీ వినోదాన్ని పంచేలా ఉంటుందీ చిత్రం. ప్రేమకథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. యువతరం జీవన శైలికి అద్దం పట్టేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు. ''కథ చాలా బాగుంది. ఇందులో నేను నటిస్తుండడం అదృష్టంగా భావిస్తున్నాను. మంచి బృందంతో కలిసి చేస్తున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకముంది''అన్నారు సుమంత్ అశ్విన్. ''మరోసారి ఓ మంచి కథలో భాగమవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది''అన్నారు నందిత. ఈ నెల 26 నుంచి చిత్రీకరణని ప్రారంభిస్తామన్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో సాయి, మధు, నవీన్, రవి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: జీవన్, ఛాయాగ్రహణం: మల్హర్భట్ జోషి.


Click it and Unblock the Notifications











