డైరక్టర్ పోలీసులకు లొంగిపోయాడు, హీరో చెప్పాడు
బెంగుళూరు: దునియా విజయ్ హీరోగా రూపొందుతున్న ...కన్నడ సినిమా 'మాస్తిగుడి' క్లైమాక్స్ షూటింగ్ బెంగళూరు సమీపంలోని తిప్పగొండనహళ్లి జలాశయంలో జరుగుతుండగా ఇద్దరు నటులు ఉదయ్, అనిల్ నీళ్లలో పడి గల్లంతైన సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్త చర్యలూ తీసుకోని కారణంగా.. సినిమా నిర్మాత, దర్శకుడు, సహాయ దర్శకుడు, స్టంట్ డైరెక్టర్, యూనిట్ మేనేజర్పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
వీరిలో నిర్మాత, సహాయ దర్శకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శనివారం దర్శకుడు నాగశేఖర్, స్టంట్ కొరియోగ్రాఫర్ రవి వర్మలు పోలీసులకు లొంగిపోయారు. ఈ విషయాన్ని నటుడు విజయ్ దునియా మీడియా ద్వారా వెల్లడించారు. శనివారం ఉదయం రవి, నాగశేఖర్లు తన ఇంటికి వచ్చారని.. పోలీసులకు లొంగిపోతామని చెప్పడంతో వారిని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లానని విజయ్ పేర్కొన్నారు.

ఈత రాని కారణంగా నీట మునిగిన వీరి మృతదేహాల కోసం సోమవారం నుంచీ గాలింపు చర్యలు చేపట్టగా.. ఉదయ్ మృతదేహం మంగళవారం రాత్రి వెలికి తీశారు. మరో నటుడు అనిల్ మృతదేహం నాలుగు రోజుల తర్వాత గురువారం ఉదయం లభ్యమైంది. జలాశయం వద్దే శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జాతీయ విపత్తు సహాయక దళం బృందాలు, గజ ఈతగాళ్లు ఇలా మొత్తం 50 మందికిపైగా గాలింపులో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











