థియేటర్ వివాదం : సుదీప్, కమలహాసన్లకు నోటీసులు
బెంగళూరు : ఆస్తి పంపకాల వివాదం ఉన్న త్రివేణి థియేటర్ను కొనుగోలు చేసే ప్రయత్నాల్ని మానుకోవాలంటూ హీరోలు సుదీప్, దర్శన్, కమలహాసన్లకు ధన్యాగౌడ అనే యువతి నోటీసుల్ని పంపింది. దాంతో ఈ వివాదం మీడియాలోకి ఎక్కి సంచలనమయ్యింది.
వివరాల్లోకి వెళితే త్రివేణి థియేటర్ యజమాని దేవకుమార్. ఆయనకు ఉమేష్, అనంత్ ఇద్దరు కుమారులు. ఇద్దరికీ థియేటర్లో సమ భాగాన్ని ఆయన రాసిచ్చారు. వచ్చే ఏడాది ఆగస్టు 1వ తేదీ వరకు థియేటర్ నిర్వహణ బాధ్యతల్ని కె.సి.ఎన్.కుమార్కు రాసిచ్చారు. ఉమేష్కు గుండెపోటు రావటం, అనారోగ్యంగా ఉండటంతో అన్ని వ్యవహారాల్ని, లావాదేవీల్ని ఆయన భార్య మంజుళ చూసేవారు. అనంత్ తన భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు.

ప్రస్తుతం థియేటర్ను విక్రయించాలని సోదరులిద్దరూ భావించారు. దాన్ని విక్రయించాలంటే మా అనుమతి కూడా కావాలంటూ అనంత్ కుమార్తె ధన్యాగౌడ కొద్ది రోజులుగా న్యాయ పోరాటం చేస్తోంది. థియేటర్ను కొనుగోలు చేసేందుకు నటులు దర్శన్, సుదీప్, కమల్ హాసన్లు యత్నిస్తున్నారని తెలుసుకుని తన న్యాయవాది శంకరగౌడ సహకారంతో వారికి నోటీసుల్ని పంపింది.
అయితే ప్రస్తుతం లీజు కాలపరిమితి ముగియనందున థియేటర్ను విక్రయించాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంజుళాఉమేష్ తెలిపారు. థియేటర్లో మాకున్న వాటాను కొనుగోలు చేసేందుకు నటులెవ్వరూ ముందుకు రాలేదని స్పష్టీకరించారు. నోటీసుల్ని అందుకున్న నటులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. దీనిపై కన్నడ పరిశ్రమలో చాలా ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











