‘మిఠాయి’ ఫెయిల్యూర్పై దర్శకుడి బహిరంగ లేఖ... అతడికి కౌంటరా?
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా 'మిఠాయి'. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 22న విడుదలైన ఈ చిత్రం బ్యాడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
సినిమాకు వచ్చిన ఫెయిల్యూర్ టాక్ మీద దర్శకుడు ప్రశాంత్ కుమార్ బహిరంగ లేఖ సంధించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆడియన్స్ కథకు కనెక్ట్ కాకపోవడం వల్లే ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. అయితే 'మిఠాయి' సినిమా తీసినందుకు తాను గర్వపడుతున్నట్లు ప్రశాంత్ కుమార్ పేర్కొనడం గమనార్హం.

రాహుల్ రామకృష్ణకు కౌంటరా?
సినిమా చేస్తున్నపుడే నా చిత్ర బృందానికి ఓ విషయం చెబుతుండేవాడిని. సినిమా సక్సెస్ అయితే సక్సెస్ పార్టీ చేసుకుందాం. ఆడక పోతే ఫెయిల్యూర్ పార్టీ చేసుకుందామని, కానీ చిత్రానికి పని చేసిన నటులు తమంతట తాముగా దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య హీరోలుగా నటించిన రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శికి కౌంటర్గా నెటిజన్లు భావిస్తున్నారు.

హిట్టయితే వంద మంది వస్తారు
సినిమా హిట్టయితే క్రెడిట్ తీసుకోవడానికి వంద మంది ముందుకు వస్తారు. ఫెయిలైతే దర్శకుడు లోన్లీగా ఉండిపోతాడు. కానీ నేను లోన్లీగా లేను. మా కెమెరామెన్ రవివర్మన్ నీలమేఘం, సౌండ్ డిజైనర్ సచిన్ సుధాకరనంద్, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, డైరెక్షన్ డిపార్టుమెంట్ నాకు అండగా ఉన్నారు. నేను ఒంటరిని కాదని ప్రశాంత్ కుమార్ చెప్పుకొచ్చారు.

మళ్లీ మీ ముందుకు వస్తాను
సినిమా ఎందుకు ఇలా అయిందని ఆత్మపరిశీలన చేసుకుని త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. ఈ ఫెయిల్యూర్ వల్ల నేను డౌన్ అయ్యనే తప్ప ఔట్ కాలేదని ప్రశాంత్ కుమార్ తెలిపారు.

ట్విట్టర్ నుంచి వైదొలగిన రాహుల్ రామకృష్ణ
‘మిఠాయి' లాంటి సినిమా చేసినందుకు విచారం వ్యక్తం చేస్తూ, అభిమానులకు క్షమాపణలు చెబుతూ రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు చేశారు. సినిమాను రిపేరు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం కానీ అవి ఫలించలేదని చెప్పుకొచ్చారు. ‘మిఠాయి' సినిమా గురించి ట్విట్టర్లో వస్తున్న కామెంట్లను భరించలేక, అభిమానులకు సమాధానం చెప్పుకోలేక చివరకు రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ నుంచి వైదొలగడం గమనార్హం.


Click it and Unblock the Notifications











