దమ్ముంటే చెయ్యి చూద్దాం: ప్రముఖ దర్శక నిర్మాతకు హెచ్చరికలు
ముంబై: 'బాహుబలి'ని హిందీ లో విడుదల చేసిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్కు బెదిరింపులు వచ్చాయి. ఉడీ దాడి నేపథ్యంలో పాకిస్థానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఎంఎన్ఎస్ ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసిన నేపధ్యంలో జరిగిన సమావేశంలో ఈ హెచ్చరిక జారీ చేసారు.
ముంబైలో పాకిస్థానీ కళాకారులకు మద్దతు ఇస్తానని,కేవలం పాకిస్దాన్ కళాకారులపై బ్యాన్ పెట్టడం సమస్యకు పరిష్కారం కాదని కరణ్ చెప్పడంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆయనపై తీవ్రంగా మండిపడుతూ ప్రకటన చేసింది.
కరణ్ తీసే సినిమాల్లో పాకిస్థానీ కళాకారులకు అవకాశం ఇస్తే.. తమదైన శైలిలో ఆయనకు తగిన సమాధానం చెబుతామని ఎంఎన్ఎస్ హెచ్చరించింది. ఆ సమావేశంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఉండటం విశేషం. దాంతో ఈ విషయం బాలీవుడ్ అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఉడీ దాడి నేపథ్యంలో పాకిస్థానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఎంఎన్ఎస్ ఇచ్చిన గడువుతో . ఇప్పటికే వాళ్లంతా ముంబై వదిలి వెళ్లిపోయారని, నగరంలో ఇప్పుడు ఒక్క పాకిస్థానీ కళాకారుడు కూడా లేరని ఎంఎన్ఎస్ సీనియర్ నేత అమే ఖోప్కర్ తెలిపారు. పొరపాటున తమకు ఎవరైనా కనపడితే మాత్రం వాళ్లను బయటకు విసిరి పారేస్తామని సీరియస్ గా హెచ్చరించారు.

అలాగే ఇలాంటి ప్రకటనలు చేస్తున్న ..కరణ్ జోహార్కు దమ్ముంటే ఒక్క పాకిస్థానీ నటుడినైనా తన సినిమాల్లోకి తీసుకోవాలని, అప్పుడు తామేం చేస్తామో చూడాలని ఖోప్కర్ అన్నారు. ఏవైనా సినిమాల్లో పాకిస్థానీ నటీనటులుంటే ఆ సినిమాలను ఇక్కడ విడుదల కానిచ్చేది లేదిన మరో సీనియర్ నేత షాలినీ ఠాక్రే చెప్పారు.
ఇదంతా దేశం కోసమే తప్ప రాజకీయాల కోసం కాదన్న విషయాన్ని బాలీవుడ్ కూడా అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు. పాకిస్థానీలు మన సైనికులను చాలామందిని చంపేస్తున్నారని చెప్పారు.
మరో ప్రక్క ముంబైలో ఉంటున్న పాకిస్థానీలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. ఈ విషయాన్ని తాము సీరియస్గానే తీసుకుంటున్నామని, వాళ్లందరికీ తగిన భద్రత ఇస్తాం కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీసీపీ అశ్వినీ సనప్ చెప్పారు.


Click it and Unblock the Notifications











