నంది అవార్డులను డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు: మోహన్ బాబు
ప్రముఖ నటుడు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య పేరిట ఏటా అందించే స్మారక అవార్డును ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ డాక్టర్ ఎం.మోహన్బాబు అందుకున్నారు. చిత్తూరు వి.నాగయ్య స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో చెన్నైలోని వాణీమహల్లో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రస్టు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ నటి పి.అంజలీదేవి, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, ఎంపీ డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి మోహన్బాబుకు అవార్డును అందజేశారు.
అవార్డు గ్రహీత మోహన్బాబు మాట్లాడుతూ సహజంగా డైలాగులు చెప్పే ఏకైక నటుడు నాగయ్య అని కొనియాడారు. ఆ తరం నటులు ప్రత్యేక పాత్రలు పోషించారని వారు మిగిల్చినవి తాము పోషించామని అన్నారు. నేటి నటుల్లో సహజత్వం లేదని అన్నారు. తిరుపతి శ్రీకాళహస్తిల మధ్య ఉన్న ఒక పల్లెటూరు నుంచి చెన్నై వచ్చానని అన్నారు. పీటీ మాస్టరుగా ఉద్యోగం చేయడానికి ఆ కోర్సులో చేరానని అన్నారు. కేసరి పాఠశాలలో 197 రూపాయల జీతానికి చేరానని అన్నారు. ఆ ఉద్యోగం ఏడాదిలోనే పోయిందన్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగానని మహాలింగపురంలోని ఒక కారు షెడ్డులో తలదాచుకున్నానని అన్నారు.
ఆ తర్వాత సహాయ దర్శకుడిగా చేరి నటుడినయ్యానని అన్నారు. 530 చిత్రాల్లో నటించానని అన్నారు. 56 సినిమాలను నిర్మించిన నట నిర్మాతను భారత దేశంలో తాను ఒక్కడినేనని పేర్కొన్నారు. ఆంధ్రలో నంది అవార్డుతో పాటు అన్ని అవార్డులను డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. కానీ అవి ప్రతిరోజు మనల్ని వెక్కిరిస్తాయి. ఈరోజు అంజలీదేవి చేతులమీదుగా మహానటుడి పేరిట తీసుకున్న ఈ అవార్డు నా జీవితంలో అత్యున్నత పురస్కారమని మోహన్బాబు ఉద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అలనాటి మేటి నటులు రాజసులోచన, కాంచన, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











