టీటీడీ చైర్మన్గా మోహన్ బాబు.. జగన్ గురించి చెబుతూ క్లారిటీ ఇచ్చిన డైలాగ్ కింగ్
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు భారీ ఉత్కంఠ రేపాయి. చంద్రబాబు, జగన్ పోటీ హోరా హోరీగా సాగిందని చెప్పుకున్నారు. కానీ చివరకు వైఎస్ జగన్ చారిత్రాత్మక విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలో పదవుల రేసు మొదలైంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో మంచు మోహన్ బాబు టీటీడీ చైర్మన్ పదవి పట్ల ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో తాజాగా ఇలాంటి వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మోహన్ బాబు. వివరాల్లోకెళితే..

వైఎస్ ఫ్యామిలీతో మంచు వారి అనుబంధం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే వైఎస్ ఫ్యామిలీతో మంచు వారికి మంచి అనుబంధం ఉంది. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాస్త దూరంగా ఉన్న మోహన్ బాబు ఫ్యామిలీ.. మళ్ళీ ఈ ఎలెక్షన్స్కి ముందు బాగా దగ్గరైంది. ఎన్నికల వేళ మంచు మోహన్ బాబు స్వయంగా వైసీపీలో చేరడమే కాకుండా, టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు.

మంచు విష్ణు కూడా..
మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. వైఎస్ జగన్ రిలేటివ్స్ లో ఒకరైన అమ్మాయిని వివాహమాడటం, అలాగే నాన్న మోహన్ బాబుకి వైఎస్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉండటం కారణంగా ఆయన కూడా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అప్పట్లో జగన్ కొత్త ఇల్లు గృహప్రవేశానికి కూడా వెళ్లి.. వైసీపీకి తాను అనుకూలమని చెబుతూ బాగా హైలైట్ అయ్యాడు.

అనుకున్న విక్టరీ సాధించడంతో.. అందరి కళ్ళు మంచు ఫ్యామిలీ పైనే
ఈ లోగా ఎన్నికలు ముగిశాయి. మంచు వారు ఏదైతే కోరుకున్నారో అలాగే జగన్ విక్టరీ సాధించారు. దీంతో ఇక మంచు మోహన్ బాబుకు జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ నామినేటెడ్ పోస్టు అయిన టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వనున్నారని, ఈ పదవి తీసుకోవాలని మోహన్ బాబు కూడా ఆసక్తిగా ఉన్నారని ప్రచారాలు ఊపందుకున్నాయి.

దైవ సన్నిధానం ఆలయం చైర్మన్గా మోహన్ బాబు
ఇప్పటికే మోహన్ బాబు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవసన్నిధానం ఆలయం చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయనకు భక్తి భావాలు చాలా ఎక్కువ. కాబట్టి టీటీడీ చైర్మన్ పదవి మోహన్ బాబుదే అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు దీనిపై స్పందించని మోహన్ బాబు.. తాజాగా ఈ అంశంపై ఓ ట్వీట్ చేస్తూ ఇలాంటి వదంతులు పుట్టించొద్దని కోరడం గమనార్హం.

మోహన్ బాబు ట్వీట్లో ఏమన్నాడంటే..
''తితిదే ఛైర్మన్ పదవి రేసులో నేనున్నానని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై గత కొన్నిరోజులుగా నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి. నా కోరిక ఒక్కటే.. జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను. ఆయన చేసే ప్రజాసేవకు నా వంతు సహకారం అందించాలని అనుకున్నాను. జగన్పై ఉన్న నమ్మకంతోనే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకానీ ఎలాంటి పదవులు ఆశించి రాలేదు. మీడియా వారు దయచేసి ఇలాంటి వదంతులు పుట్టించొద్దని కోరుతున్నా'' అని తన ట్వీట్ లో పేర్కొన్నారు మోహన్ బాబు.


Click it and Unblock the Notifications











