నా మీద ట్రోలింగ్ వెనుక ఆ'ఇద్దరు' హీరోలు.. 100 మంది టీం కూడా.. మోహన్ బాబు సంచలన ఆరోపణలు!
'కలెక్షన్ కింగ్' మంచు మోహన్ బాబు చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ట్రోల్స్ వెనుక ఇద్దరు హీరోలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే

చాలా కాలం తరువాత
మోహన్ బాబు ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో నటించడం తగ్గించారు. 2020లో సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు(తెలుగులో ఆకాశమే హద్దురా) అనే సినిమాలో నాయుడు అనే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఆయన చాలా కాలం తరువాత 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 18న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు.

సినిమా మీద ఆసక్తి
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్తో కలసి విష్ణు మంచు నిర్మించిన "సన్ ఆఫ్ ఇండియా" సినిమాలో డాక్టర్ మోహన్బాబు అదనంగా చిత్రానికి స్క్రీన్ప్లే బాధ్యతను కూడా భుజాన వేసుకున్నారు. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీరాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించడంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది.

బాధపడక తప్పదు
ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదల కానున్న క్రమంలో సినిమా యూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా విడుదల సందర్భంగా ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ తనపై వస్తున్న ట్రోలింగ్స్పై స్పందించారు. ట్రోలింగ్, వ్యంగంగా వచ్చే మీమ్స్ చూసి చాలా బాధపడుతున్నానని మోహన్ బాబు అన్నారు. అసలు వాటిని దృష్టిలోకి తీసుకోవలసిన అవసరం లేదు కానీ మనిషిగా పుట్టినందుకు ఆత్మాభిమానం ఉంటుంది కదా కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడక తప్పదు అని చెప్పుకొచ్చారు.

ఎవరైనా పంపిస్తే చూస్తా
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ క్రియేషన్ చాలా బాధ కలిగిస్తుందన్న ఆయన ఎదుటి వారి మీద ట్రోలింగ్ చేయవచ్చేమో నాకు తెలీదు కానీ.. అందులో వ్యంగ్య ధోరణి మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. తానయితే మామూలుగా అయితే వాటిని చూడను కానీ ఎవరైనా పంపిస్తే చూస్తా అని అన్నారు. అదే పని మీద కూర్చుని చేసేవాళ్లు కూడా కొందరున్నారని తెలిసిందని, వారికి అదే ఉద్యోగం అని అన్నారు.

100 మందిని అపాయింట్ చేసుకుని
ఒక ఇద్దరు హీరోలు 50 నుంచి 100 మందిని అపాయింట్ చేసుకుని ఇలా ప్రతి ఒక్కరినీ ట్రోల్ చేయిస్తున్నారని ఆరోపించిన ఆయన ఆ హీరోలు ఎవరో కూడా నాకు తెలుసు అని అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చెప్పినవాడు, చేసిన వారిని ప్రకృతి చూస్తోంది, ప్రస్తుతానికి వారు బావుంటారు కానీ ఏదో ఒక రోజు వారు శిక్ష అనుభవిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆ శిక్ష అనుభవించిన నాడు వారికి ఎవరు సహాయ పడరని, వెనుక ఎవరూ ఉండరని అన్నారు. ఈ ట్రోల్స్, మీమ్స్ సరదాగా నవ్వుకునేలా ఉండాలి కానీ ఎదుటి వాడి పతనం కోరుకునేలా ఉండకూడదు అని అన్నారు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











