డ్రగ్స్ కేసు: ముమైత్ ఖాన్కు మినహాయింపు, బిగ్ బాస్ రక్షించారు
డ్రగ్స్ కేసు విచారణకు ముమైత్ హాజరు కావడం లేదు. ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉండటమే కారణం.
సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్స్ను పోలీసులు నేటి(జులై 19) నుండి విచారించనున్నారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్తో డ్రగ్స్ కేసు విచారణ పర్వం మొదలుకాబోతోంది.
19న పూరీ జగన్నాథ్, 20న ఛార్మి, 21న ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యామ్ కె నాయుడు, 24న రవితేజ, 25న ఆర్డ్ డైరెక్టర్ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న నందు, 29న తనీష్ ఇలా ఎవరికి నిర్ణయించిన తేదీల్లో వారు సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ముమైత్ ఖాన్కు విచారణ నుండి ప్రస్తుతానికి మినహాయింపు ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

ముమైత్ తేదీని నిర్ణయించలేదు: అకున్ సబర్వాల్
నోటీసులు జారీ చేసిన వారిలో ముమైత్ ఖాన్ మినహా అందరూ హాజరవుతారని, ఆమె ఓ టీవీ షోలో ఉన్నందున విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదని ఎక్సైజ్ (ఎన్ ఫోర్స్ మెంట్) డైరెక్టర్ సబర్వాల్ తెలిపారు.

పోలీసులకు దొరకని ముమైత్
ముమైత్ ఖాన్ విషయంలో ఇలా జరుగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె అడ్రస్ పోలీసులకు తెలియకపోవడం ప్రధాన కారణం. దీంతో ఆమెకు నోటీసులు ఎలా పంపాలో పోలీసులు తేల్చుకోలేక పోయారు.

విఫలమైన పోలీసులు
ఆమె హైదరాబాద్లో ఓ అడ్రస్లో ఉంటుదని తెలుసుకున్న పోలీసులు అక్కడికి నోటీసులు పంపినా.... ఆవిడ చాలా కాలం క్రితమే ఆ ఇల్లు ఖాళీ చేసిందని తేలింది. ముంబైలో కూడా ఆమెకు సరైన అడ్రస్ అంటూ ఏమీ లేక పోవడంతో నోటీసులు అందించడంలో పోలీసులు విఫలం అయ్యారు.

బిగ్ బాస్ రక్షించాడు
పోలీసులు నోటీసులు పంపే సమయానికే ముమైత్ ఖాన్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైపోయింది. షో నిర్వాహకులు చట్టపరమైన అనుమతులతోనే ఈ షోటో నిర్వహిస్తున్నారు. షో నుండి మధ్యలో ఆమెను బయటకు తీసుకురావడానికి వీల్లేని పరిస్థితి ఉంది. దీంతో బిగ్ బాస్ ఆమెను ప్రస్తుతానికి విచారణ నుండి రక్షించారని చర్చించుకుంటున్నారు.

ముమైత్ విచారణ వాయిదా వేసిన పోలీసులు
నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి నోటీసులు అందించేందుకు చట్టపరమైన అడ్డంకులు ఉండటంతో ప్రస్తుతానికి ముమైత్ ఖాన్ విచారణను వాయిదా వేశారు. ఆమెను ఎలా బయటకు తీసుకురావడం, నోటీసులు ఎలా అందించడం అనే విషయాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











