అక్కినేని మృతికి సంతాపంగా...టాలీవుడ్ బంద్
హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా రేపు(గురువారం) తెలుగు చిత్ర పరిశ్రమ బంద్ పాటించనుంది. ఈ విషయమై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ....రేపు షూటింగులు బంద్ చేస్తున్నామని, థియేటర్ల యజమానులు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ఆయన కోరారు.
అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్కినేని అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొననున్న నేపత్యంలో ఇటు నగర ట్రాఫిక విభాగం, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయన వూపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్ పెట్టారు. తరువాత పదినిమిషాలకే ఆసుపత్రికి వచ్చిన డా.సోమరాజు వైద్యుల బృందంతో కలసి పరిశీలించారు. అప్పటికే శ్వాస ఆగిపోవటంతో ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు.
నాటకరంగం ద్వారా సినిమా రంగంలోకి వచ్చిన ఏఎన్ఆర్ ధర్మపత్ని సినిమాతో సినీజీవితం ప్రారంభించాడు. అప్పటినుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలలో 75సంవత్సరాల పాటు నటించాడు. ఎన్.టి.ఆర్ తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.


Click it and Unblock the Notifications











