మిస్టరీ : 'రుద్రమదేవి' నగల కేసు...ఏది నిజం?
హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రుద్రమదేవి' సినిమా చిత్రీకరణలో నగలు మాయమైన కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. సినిమా యూనిట్ సభ్యులు దాదాపు 60 మందిని ఆదివారం గచ్చిబౌలి పోలీసులు విచారించినట్లు తెలిసింది. చోరీకి గురైన నగలు సినిమాలో ప్రధానపాత్ర పోషిస్తున్న అనుష్క కోసం తెచ్చినవి కావని, మరో నటి కేథరిన్ కోసం వాటిని తీసుకొచ్చినట్లు పోలీసులు వివరించారు.
మరో ప్రక్క షూటింగ్ లలో ఎక్కువగా రోల్డ్గోల్డ్ నగలనే వాడతామని సినిమా యూనిట్ సభ్యులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇది వరకు జరిగిన సినిమా షూటింగ్ వీడియోనూ పరిశీలించారు. ఈ సినిమాలో అనుష్క అలంకరణకు ఉపయోగించినవి రోల్డ్గోల్డ్ నగలేనని, షూటింగ్లో బంగారు ఆభరణాలు ఉపయోగించే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు.

కేసు వివరాల్లోకి వెళితే... చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 1.5 కిలోల బరువున్న సంప్రదాయ నగలు చోరీకి గురవడంతో సినిమా యూనిట్ సభ్యులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. గోపన్పల్లిలోని రామానాయుడు స్టూడియోకు చెందిన స్థలంలో 'రాణిరుద్రమ' సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
ఈ చిత్రంలో రుద్రమదేవి పాత్రను పోషిస్తున్న అనుష్క అలంకరణకు సంప్రదాయ నగలు ఉపయోగిస్తున్నారు. నగలను చెన్నైలోని నాదెండ్ల అంజనేయశెట్టి సంస్థ సరఫరా చేస్తోంది. ఆ సంస్థ ప్రతినిధి రవి సుబ్రమణ్యం వాటిని చెన్నై నుంచి తీసుకొచ్చి నిర్వాహకులకు ఉదయాన్నే ఇచ్చి షూటింగ్ అనంతరం తిరిగి తీసుకెళ్తున్నారు.
శనివారం ఉదయం సుబ్రమణ్యం కిలోన్నర బరువున్న ఆభరణాలతో వచ్చారు. మధ్యాహ్నం నగల సంచిని షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న విశ్రాంతి వ్యాన్లో డ్రైవర్ సీటు వెనుక ఉంచారు. భోజనం అనంతరం చూడగా సంచిలో నగల పెట్టెలు కనిపించలేదు.
దీంతో సినిమా ఎగ్జికూటివ్ ప్రొడ్యుసర్ రాంగోపాల్ శనివారం రాత్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాక్సుల్లో ఎన్ని బంగారు, ఎన్ని రోల్డ్గోల్డ్ నగలు ఉన్నాయనే స్పష్టత రాలేదని, సంస్థ నిర్వాహకులు వస్తేనే లెక్క తేలుతుందని ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











