నా కొడుకు సక్సెస్ను క్యాష్ చేసుకోవాలనుకోవడం లేదు: నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కించారు. కెరీర్లో అంత పెద్ద సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకోక పోయినా... అడపాదడపా హిట్స్ అందుకున్నారు. అయితే రామ్ చరణ్తో చేసిన 'ఆరెంజ్' ఆయన్ను ఆర్థికంగా చాలా దెబ్బతీసింది. తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆదుకోవడంతో ఆ నష్టాల నుండి బయట పడ్డారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఆయన సినిమా నిర్మాణానికి దూరంగానే ఉన్నారు.
మళ్లీ ఇన్నాళ్లకు నాగబాబు 'నా పేరు సూర్య' సినిమా ద్వారా నిర్మాణ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రామలక్ష్మి క్రియేషన్స్ బేనర్లో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.... సమర్పకుడిగా అల్లు అర్జున్ సినిమాను ఎందుకు ఎంచుకున్నారు? వరుస హిట్లు కొడుతున్న మీ కుమారుడు వరుణ్ తేజ్ సినిమాలకు సమర్పకుడిగా ఉండొచ్చు కదా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం వాడి చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. నేను చేయాలనుకుంటే వెంటనే మా వాడితో సినిమా చేసి డబ్బు సంపాదించవచ్చు. సక్సెస్ బాటలో ఉన్న వాడిని ఇమేజ్ను క్యాష్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వరుణ్తో సమయం వచ్చినపుడు తప్పకుండా సినిమా చేస్తాను అని నాగబాబు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











