చంపేస్తారా నేను రెడీ.. మా తమ్ముడి కోసమే దూరంగా ఉంటున్నా.. నాగబాబు!
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాజకీయ, సినిమా అంశాలపై నాగబాబు చేస్తున్న వీడియోలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని ఉద్దేశించి నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరమైన రాజకీయ చర్చకు కారణం అవుతున్నాయి. తాజాగా నాగబాబు మరో వీడియోని యూట్యూబ్ లోకి వదిలారు. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్తలని అధికారపక్షం ఒత్తిడితో అరెస్ట్ చేసిన సంఘటన జరిగింది. దీనిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రోల్ చేసిన నెపంతో
జనసేన కార్యకర్తలు కొందరు టిడిపికి చెందిన సాధినేని యామినిని ట్రోల్ చేశారనే నెపంతో పోలీసులు అరెస్ట్ చేసి దాడులకు పాల్పడిన ఘటన జరిగింది. పోలీసులు అన్యాయంగా జనసేన కుర్రాళ్ళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. అధికార పక్షం ఒత్తిడి వల్లే పోలీసులు దారుణంగా వ్యవహరించారని నాగబాబు అన్నారు.

అలా అనుకుంటే పొరపాటే
ఇలా అధికారం చేతిలో పెట్టుకుని కేసులు పెడితే మేము భయపడిపోతాం అని అనుకుంటే పొరపాటే అని నాగబాబు అన్నారు. ఇంతకు 100 రెట్లు శక్తితో తిరిగి పోరాడతాం అని అన్నారు. సాధినేని యామిని నేరుగా వచ్చి జనసేన కార్యకర్తని చెంపదెబ్బ కొట్టినట్లు తనకు తెలిసిందని నాగబాబు అన్నారు. ఎంతకాలం మీ చేతిలో అధికారం ఉంటుంది అని నాగబాబు చంద్రబాబుని ప్రశ్నించారు.
తమ్ముడి కోసం
నేను జనసేన పార్టీ మెంబర్ ని కాదు. కానీ ఆ పార్టీకి అభిమానిని. మా తమ్ముడిపై, జనసేన పార్టీపై కుటుంబ పార్టీ అనే ముద్ర రాకూడదనే దూరంగా ఉంటున్నట్లు నాగబాబు తెలిపారు. ఇప్పటికే 59 ఏళ్ళు వచ్చాయి. ఇక తాను దేనికీ భయపడాల్సిన అవసరం లేదు అని నాగబాబు అన్నారు. సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడుతున్నారు అని అంటున్నారు. బయటకు వచ్చి పోరాడగల శక్తి కూడా తనకు ఉందని తెలిపారు.

చంపేస్తారా నేను రెడీ
జనసేన కార్యకర్తలపై ఇలాంటి సంఘటనలు మళ్ళి రిపీట్ అయితే నేరుగా నేనే వచ్చి పోరాటానికి కూర్చుంటా. నన్ను కొడతారా.. చంపేస్తారా.. నేను రెడీ అని నాగబాబు అన్నారు. జనసేన కార్యకర్తల అరెస్ట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మంత్రి చినరాజప్ప, రాష్ట్ర డిజిపి క్షమాపణ చెప్పాలని నాగబాబు కోరారు.


Click it and Unblock the Notifications











