ఉద్యమాలతో నష్టమే, రాజకీయ నాయకులు భయపెట్టొద్దు, రమ్మేంటే వచ్చాం : నాగార్జున
హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల వల్ల సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, భారీ బడ్జెట్ల రూపంలో కన్నా....ఉద్యమాల కారణంగానే సినిమాలకు నష్టమొక్కువని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ... అందరికీ సినిమా అనేది 'సాఫ్ట్ టార్గెట్'గా మారిపోయిందనీ, ఉద్యమాల కారణంగా సినిమాకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత తెలుగు సినిమాకి కేంద్రంగా హైదరాబాదే ఉంటుందనీ, మరో కేంద్రం ఏర్పడే అవకాశాలు తక్కువేననీ అభిప్రాయపడ్డారు.

"అప్పట్లో చెన్నారెడ్డి, జలగం వెంగళరావు తదితరులు రమ్మంటేనే నాన్నగారు అందరికంటే ముందు 1963లోనే మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చారు'' అని గుర్తుచేశారు. అప్పటికి ఇక్కడ సారథీ స్టూడియోస్ ఒక్కటే ఉండేదని, తర్వాత స్టూడియో కట్టమని అడిగితే ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారని వివరించారు. అలా 1963లో మొదలైతే 1993కి గానీ.. అంటే 30 ఏళ్లకుగానీ తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లో పూర్తిగా స్థిరపడలేదని అన్నారు. ఇన్నేళ్లైనా ఇప్పటికీ మ్యూజిక్ కంపోజింగ్కు చెన్నై వెళ్తున్నారని, చెన్నై నుంచి కొంతమంది స్పెష ల్ ఫైటర్లను, స్పెషల్ డాన్సర్లను తెచ్చుకుంటున్నారని అన్నారు.
"రాష్ట్ర విభజనకు రెండేళ్లు పడుతుంది. అప్పుడు ఎలాంటి సమస్యలొస్తాయో నాకు తెలీదు. ఏవైనా వస్తే ఇండస్ట్రీ అంతా కలిసి వాటిని పరిష్కరించుకుంటుంది. అప్పుడు పెద్ద సమస్యలొస్తాయని ఇప్పట్నించే భయపడిపోయి ఇష్యూ చేస్తే అదే పెద్ద సమస్య. ముందు సమస్యను రానివ్వండి. వస్తే ఎదుర్కోవాల్సిందే'' అని నాగార్జున వ్యాఖ్యానించారు. అలాగే.. విభజన తర్వాత సెంటర్ మార్చడం అంత సులభం కాదన్నారు. "ఇక్కడ స్నేహితులుంటారు. పిల్లలు స్కూళ్లలో, కాలేజీలో చదువుతుంటారు. వ్యాపారాలు, వ్యాపకాలు ఉంటాయి. వాటన్నింటినీ మార్చాలంటే ఎవరికైనా కష్టమే. అలా జరగదనే అనుకుంటున్నా. ఈ విషయంపై నేనేం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. ఒక్కచోటని కాకుండా ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వెళ్లి షూటింగ్ చేసుకుని వస్తాం'' అన్నారు. "విభజన తర్వాత పన్నులు ఎలా ఉంటాయో, ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. రాజకీయ నాయకులు మొదట వాటిని పరిష్కరించాలి. వాళ్లు మమ్మల్ని భయపెట్టడం మానేయాలి'' అని విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











