Bigg Bossలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగార్జున., 1080 ఎకరాల అటవీ భూమి దత్తత
హీరో నాగార్జున మాట నిలబెట్టుకున్నారు. హీరో ప్రభాస్ లాగానే హైదరాబాద్ శివారులో ఆయన వెయ్యి ఎకరాలకు పైగా అటవీ భూమి దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. గతంలో ప్రభాస్ కూడా ఖాజీపల్లి అటవీ ప్రాంతంలో 1650 ఎకరాలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో నాగార్జున kuda నడిచారు. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్
తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న సంచలన టీవీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేలో "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" నినాదం మార్మోగిన సంగతి తెలిసిందే. కోట్లాదిమంది ప్రజానీకానికి ఒక మంచి సందేశం అందించాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులు "గ్రీన్ ఇండియా ఛాలెంజ్"ను బిగ్ బాస్ లో భాగం చేశారు. "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే స్టేజి పైకి వచ్చి స్టార్స్, సెలెబ్రెటీలు అయితే ఫారెస్ట్ లను దత్తత తీసుకున్నారని చెబుతూ మొక్కలు ఎందుకు పెంచాలనే విషయం మీద అవగాహన పెంచారు.

బిగ్ బాస్ స్టేజ్ మీదనే
ఈ క్రమంలో నాగార్జున ఆ స్టేజ్ మీదనే కీలక ప్రకటన చేశారు. సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్", వారి మాటలు, స్పూర్తి నన్నెంతగానో కదిలించాయి.. తాను కూడా వారు ఎక్కడ చూపెడితే అక్కడ అడవిని దత్తత తీసుకొని పెంచుతాను.. సమాజం పట్ల నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తా'ను అంటూ పేర్కొన్నారు. అంతేకాదు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు అందించిన మొక్కను బిగ్ బాస్ హౌస్ లో నాటి వారి స్పూర్తిని కొనసాగిస్తామని ప్రకటించారు. అలా ప్రకటించినట్లుగానే నాగార్జున తన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు
హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, అఖిల్ తో పాటు సుమంత్, సుశాంత్, అక్కినేని సుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఆనందంగా ఉందన్న నాగార్జున
అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్ ఫండ్) ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్కును అటవీ శాఖ ఉన్నతాధికారులకు నాగార్జున అందించారు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ ''మన పరిసరాలు, రాష్ట్రం, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటానని తెలిపారు. గత బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడవి దత్తతపై సంతోష్ తో చర్చించానని, ఆ రోజు వేదిక మీద ప్రకటించినట్లు ఇప్పుడు అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

'అఖిల్, చైతూ' కూడా
ఈ శంఖుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వం తరపున అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (ఎస్.ఎఫ్) ఆర్.ఏం. డోబ్రియల్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ డీఎఫ్ఓ జోజి, డీఎఫ్ఓ అశోక్ పాల్గొన్నారు. అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున ఇతర కుటుంబ సభ్యులు, అఖిల్, నాగచైతన్య సుప్రియ యార్లగడ్డ, సురేంద్ర యార్లగడ్డ, సుమంత్ కుమార్, సుశాంత్, నాగ సుశీల, లక్ష్మీ సాహిత్య, సరోజ, వెంకట నారాయణ రావు, జ్యోత్స్న, అనుపమ, ఆదిత్య, సంగీత, సాగరిక, తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











