‘డమరుకం’ వాయిదాపై నాగ్ ఫ్యాన్స్ వీరంగం
హైదరాబాద్: నాగార్జున తాజాగా సినిమా 'డమరుకం' ఈ రోజు(నవంబర్ 10)న విడుదలవ్వాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినిమా చూడటానికి థియేటర్ల వద్దకు వచ్చిన నాగార్జున అభిమానులు సినిమా మళ్లీ వాయిదా పడిందనే విషయం తెలసుకుని ఆగ్రహానికి గురయ్యారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నగరాల్లో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు.
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్, దేవి థియేటర్, అదే విధంగా విజయవాడలోని అలంకార్ థియేటర్, తిరుపతిలోని సంధ్య థియేటర్ వద్ద అభిమానులు ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు దిగారు. సినిమాను ప్రదర్శించక పోవడంపై థియేటర్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్లు పోలీసులు భద్రత ఏర్పాటు చేసారు.
అయితే సినిమా వాయిదా పడటం తమ చేతుల్లో ఏమీ లేదని, డిస్ట్రిబ్యూటర్ల నుంచి తమ ఇంకా ప్రింట్లు అందలేదని థియేటర్ల యజమానులు అంటున్నారు. ఓ వైపు మీడియాలో సినిమా విడుదలపై ప్రచారం చేయడంతో పాటు పేపర్లలో కూడా థియేటర్ల లిస్ట్ ప్రకటన ఇచ్చారు. అన్నీ సిద్ధం అయిన తర్వాత కూడా సినిమా వాయిదా పడటం అభిమానులను విస్మయానికి గురి చేసింది. ఇంత జరుగుతున్నా...నిర్మాతల నుంచి ఎందుకు వాయిదా వేసామనే ప్రకటన రాక పోవడం గమనార్హం.
డమరుకం చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించగా, ఆర్ వెంకట్ నిర్మించారు.. వెయ్యి సంవత్సరాల తర్వాత అంధకాసురుడు మళ్లీ పుట్టి పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రపంచాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని సహాయంతో ఒక సామాన్య వ్యక్తి ఆ రాక్షసుడితో ఎలా పోరాడాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది ఈచిత్రం కథ. నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, రవి శంకర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











