నాగ్ కు వాళ్లని చూస్తే ఆనందమట
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ దంపతులను కలవడం ఎప్పటికీ ఆనందమే అంటున్నారు నాగార్జున. కళ్యాణ్ జ్యూయిలరీస్ కమర్షియల్ యాడ్ షూటింగ్లో భాగంగా నటుడు ప్రభుతోపాటు అమితాబ్, జయ బచ్చన్లను కలిసిన ఫొటోను నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ప్రకటన కోసం తన స్నేహితుడు ప్రభు, అమితాబ్, జయ బచ్చన్లను కలవడం ఆల్వేస్ ప్లెజర్ అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా వారితో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. గతంలో కూడా నాగార్జున బిగ్బి అమితాబ్తో కలిసి ఓ వాణిజ్యసంస్థ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా'. కల్యాణ్కృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ విషయమై నాగార్జున చాలా సంతోషంగా ఉన్నారు.
నాగార్జున మాట్లాడుతూ ‘‘సంక్రాంతికొచ్చిన సినిమాల్లో మా చిత్రం నెంబర్వన్గా నిలవడం సంతోషాన్నిచ్చింది. నాన్నగారి పంచె, వాచీ ధరించి ఈ సినిమాలో నటించా. ‘మనం' సెట్నే బంగార్రాజు ఇంటిగా చూపిస్తూ అక్కడే చిత్రీకరణ జరిపాం. నాన్నగారి ఆత్మే బంగార్రాజు పాత్రలోకి ప్రవేశించిందేమో అన్నట్టుగా ఆ పాత్ర పండింది. ఆయన ఆశీర్వాదం ఈ సినిమాకి చాలా ఉంది అన్నారు.
అలాగే...సంక్రాంతి సందర్భంగా ఎక్కువ సినిమాలు విడుదల కావడంతో 450 థియేటర్లలోనే మా సినిమా విడుదలైంది. వరుసగా మూడు రోజులు రూ.5కోట్లు చొప్పున షేర్ లభించింది. రెండో వారానికి థియేటర్ల సంఖ్య 600కి పెరుగుతుంది. రికార్డుల్ని నేను పెద్దగా పట్టించుకోను. నాన్నగారు నటించిన ‘ప్రేమాభిషేకం', ‘మాయాబజార్' చిత్రాల్ని రికార్డులతో ముడిపెట్టి చూడలేం. అప్పట్లో నాన్నగారు, ఎన్టీఆర్గారు నటించిన సినిమాల్ని ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్లి మరీ చూసేవారట. ఎప్పుడూ థియేటర్కి వెళ్లని ప్రేక్షకులు కూడా ఇప్పుడు ట్రాక్టర్లలోనూ, బస్సుల్లోనూ వెళ్లి నా సినిమాని చూస్తున్నారు. ఈ స్పందన సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది.
ఇక సినిమాలో బంగార్రాజు పాత్ర అందరినీ నవ్విస్తున్నా... రాము పాత్ర చేయడమే నాకు కొత్త రకమైన అనుభూతినిచ్చింది. ఎవరితోనైనా కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం నాకు అలవాటు. అందుకే రాము పాత్ర చేసేటప్పుడు చాలా కష్టపడాల్సొచ్చింది. రమ్యకృష్ణ, నేను ఒకేసారి పరిశ్రమలోకి అడుగుపెట్టాం. తను సెట్లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. సత్యభామ పాత్రలో ఒదిగిపోయిన తీరు సినిమాకి కలిసొచ్చింది.
లావణ్యతో కలిసి సహజంగా నటించేందుకు ప్రయత్నించా. కొత్తవాళ్లతో కలిసి సినిమా చేయడమంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల వయసుని నా పాత్రల్లో చూపిస్తుంటారు. కల్యాణ్కృష్ణ నాకు మరో మంచి సినిమాని ఇచ్చాడు. ఈ సినిమా చేస్తున్నప్పుడు అనూప్ రూబెన్స్ అమ్మగారు చనిపోయారు. అనూప్ తన పనితోనే ఆమెకి నివాళి అర్పిస్తూ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. కల్యాణ్కృష్ణ తన రెండో చిత్రాన్ని కూడా మా సంస్థలోనే చేస్తున్నారు''అని చెప్పారు.
నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్, బ్రహ్మానందం, సంపత్,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్ అనసూయ, దీక్షా పంత్, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్, స్క్రీన్ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, సిద్ధార్థ్ రామస్వామి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్కృష్ణ.


Click it and Unblock the Notifications











